ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
తెనాలిరూరల్/కొల్లిపర: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడమే కాకుండా అతి తక్కువ సమయంలోని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల పరిధిలోని దావులూరు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో డీసీఎంఎస్ ద్వారా ప్రభుత్వం ధాన్యం కొలుగోలు చేయటం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం 51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 209 రైతు సహాయ కేంద్రాల పరిధిలో 47 కస్టర్లు ద్వారా గురువారం నుంచి ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు 6.54 కోట్ల గోతాలు సరఫరా చేయటం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు రైతులు ధాన్యం అందిస్తే సాయంత్రం 6 గంటలలోపే వారి ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఒక్క బ్యాంకు సెలవు దినాలు తప్పా మిగిలిన అన్ని రోజుల్లో 4 గంటల లోపల నగదు జమ అవుతుందని తెలిపారు. ఈ ఖరీఫ్న్లో ఇప్పటి వరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటలలోపే రూ.680 కోట్ల నగదు జమ యటం జరిగిందన్నారు.
రైతులకు ఉచితంగా టార్పాలిన్ పట్టలు
తెనాలి రూరల్: రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా టార్పాలిన్ పట్టలను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లింగారావు సెంటరులో గురువారం సాయంత్రం ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వర్షాలకు ఇబ్బందులు పడకుండా రైతులకు టార్పాలిన్ పట్టాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోందని, ఈలోగా రైతులు తమ పంటను అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు బస్సు కింద పడి మృతి చెందిన సంఘటన ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాగార్జునపేటకు చెందిన ముగావత్ జాంకి (85) గుంటూరులో ఆమె కుమార్తె వద్దకు వచ్చింది. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇన్ గేటు వద్ద బస్టాండ్లోకి వెళుతూ డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలిపై ముందు టైర్ ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


