లబ్బీపేట(విజయవాడతూర్పు): గుంటూరు జిల్లా పెనుమాకలోని వైష్ణవ మహా దివ్య క్షేత్రం ప్రాంగణంలో మంగళవారం నుంచి ఏడాది పాటు (365 రోజులు) అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు క్షేత్రం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాజేటి వెంకట దుర్గాప్రసాద్, దూపుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 23 చైత్రమాస పౌర్ణమి నుంచి 365 రోజుల పాటు దివ్యక్షేత్ర ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. తొలిరోజు ఉదయం 7 గంటలకు హనుమత్ వైభవ శోభాయాత్ర కనుల పండువగా నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు శ్రీ హనుమత్ విగ్రహ స్థాపన, 8.30కు హనుమత్ ఇష్టి ఉంటుందని తెలిపారు. కార్యసిద్ది హనుమాన్ మందిర నిర్వహణ కమిటీ చైర్మన్ తాడికొండ శ్రీనివాసరావు, ఘట్టా ధనప్రసాదరావు, ఉమామహేశ్వరగుప్తా, సూర్యప్రకాశరావు, మురళీరావు, భావన్నారాయణ పాల్గొన్నారు.