
విశ్లేషణ
సగటు భారతీయులు అమెరికా వెళ్ళాలని ఎందుకు కోరుకుంటారు? అక్కడ సంపాదించే డాలర్లలో కొద్ది మొత్తం ఇక్కడకు పంపించినా అది వారి కుటుంబ సభ్యులకు రూపాయలలో గణనీయమైన మొత్తాలుగా మారుతాయి కనుక. అమెరికా నుంచి జమ చేసే మొత్తాలు, స్వదేశంలోని బంధు జనాన్ని నిజంగానే ఎంతగానో ఆదుకుంటున్నాయి. ప్రవాస భారతీయులు అలా చేసే జమలపైన 5% పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపా దించారు.
దానిని ఆయన తమ ఖజానాకు పెద్ద మొత్తం గడించి పెట్టగల సొగసైన బిల్లుగా భావిస్తున్నారు. మనకు మాత్రం అది పీడకల లాంటి ప్రతిపాదనే. ఇది భారతదేశంలోని అనేక కుటుంబాల జీవనాధారాన్ని నీరుగార్చవచ్చు. జమ చేసే మొత్తాలపై ఇక మీదట అమెరికా ప్రభుత్వానికి పన్ను కట్టవలసి ఉంటుంది కనుక వారు పంపే మొత్తాలు కొంతమేరకైనా తగ్గవచ్చు. ఆ విధంగా అది మనకు తిరోగమన చర్య కిందే లెక్క.
అమెరికా నుంచే ఎక్కువ...
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, అమెరికాలో 12 లక్షల 80 వేల మంది ప్రవాస భారతీయు (ఎన్.ఆర్.ఐ)లుగా ఉన్నారు. మరో 31 లక్షల 80 వేల మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తు (పి.ఐ.ఓ.)లుగా ఉన్నారు. విదేశాల నుంచి నగదు జమల విషయంలో భారతదేశం అగ్ర స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు 2024 రెమిటెన్స్ రిపోర్ట్ తెలుపుతోంది.
2024లో అలా 129 బిలియన్ల డాలర్లు వచ్చిపడ్డాయని అది వెల్లడించింది. ఇలా జమ అయ్యేదానిలో అమెరికా నుంచి వచ్చేదే పెద్ద మొత్తంగా ఉంటోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) నివే దిక పేర్కొంటోంది. అమెరికా నుంచి జమయ్యే మొత్తం 2016–17లో 22.9 శాతంగా ఉన్నది 2023–24 నాటికి 27.7 శాతానికి పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.
మన దేశానికి 120 బిలియన్ల డాలర్లు జమ అయ్యాయనుకుందాం. దానిలో అమెరికా వాటా 27% అంటే, ఒక్క అమెరికా నుంచే 33 బిలియన్ల డాలర్లు చేకూరినట్లు లెక్క. దీనిపై ఇపుడు 5% పన్ను విధిస్తే, అది సుమారుగా 1.6 బిలియన్ డాలర్లు (రూ. 13,000 కోట్లు)గా లెక్కకు వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియాకు రావలసిన ఆ మొత్తానికి, ట్రంప్ నూతన పన్ను విధానం వల్ల గండి పడుతుంది. దీన్ని కేవలం సంఖ్యల రూపంలో చూడవద్దు. ఇది అనేక భారతీయ కుటుంబాల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంది.
బతుకు బండి లాగించడానికి, ఇతర కుటుంబ సభ్యుల చదువు సంధ్యలకు, ఆరోగ్య రక్షణకు ఆ మొత్తాలు ఉపయోగపడుతున్నాయి. ఆ ముఖ్య ఆదాయానికి కత్తెర పడితే భారతదేశంలోని ఆయా కుటుంబాల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఈ జమలు ఎవరి దయా ధర్మాలూ కావు. వలస వెళ్ళినవారు చెమటోడ్చి సంపాదించిన ఆదా యంలో కుటుంబ పోషణకు పంపుతున్న కొంత మొత్తాలు.
అల్ప, మధ్యాదాయ దేశాలు 2023లో 650 బిలియన్ల డాలర్లను విదేశీ జమల కింద అందుకున్నాయి. ఇది ఆ యా దేశాల అభివృద్ధికి అధికారికంగా అందిన సహాయం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కన్నా ఎక్కువ. ఇది భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యమే కాదు, లక్షలాది మందికి సామాజిక భద్రతా కవచంలా పనిచేస్తోంది. ఎంతో ముఖ్య మైన ఈ మొత్తాలు అధిక లావాదేవీ రుసుములతో ఒత్తిడిని ఎదు ర్కొంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీజు 2023లో సగటున 6.18 శాతంగా ఉంది. కొన్ని దేశాల్లోనైతే ఆ ఫీజు 8 శాతం పైచిలు కుగా ఉంది. అసమంజసంగా ఉన్న ఈ ఫీజుల భారాన్ని తగ్గించాలనీ, ప్రపంచంలోని పేదలకు ఊరట కల్పించాలనీ ఐక్యరాజ్య సమితి భావించింది. విదేశాల నుంచి నగదు జమ చేసేవారిపై పడే ఫీజుల భారాన్ని 3% కన్నా తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. లావాదేవీల రుసుము 5%కన్నా మించి ఉన్నవి 2030 నాటికి ఒక్కటి కూడా లేకుండా చేయాలని సంకల్పించింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్య స్ఫూర్తికి తూట్లు
ట్రంప్ ప్రతిపాదిత పన్ను ఈ అంతర్జాతీయ నిబద్ధతపై ప్రత్యక్ష దాడి కిందకే వస్తుంది. ఇది లావాదేవీ జరిపినందుకు మోస్తున్న భారాన్ని మరింత పెంచడమే కాదు, ఆర్థిక అన్యాయానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. విదేశాల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నవారు తమ వ్యక్తిగత కోరికలను పక్కనబెట్టి, తమకున్న పరిమిత ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని కుటుంబాల సంక్షే మానికి పంపుతున్నారు. లావాదేవీ ఫీజుకు తోడు మరో 5% పన్ను విధించడం వారిని శిక్షించడం, దోచుకోవడమే అవుతుంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న పేదరికం లేకుండా చేయడమనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్.డి.జి.) స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుంది.
నగదు జమ చేసేందుకు రుసుములు మితిమీరితే జనం బ్యాంకులు, డిజిటల్ వ్యాలెట్ల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అని యత, క్రమరహిత మార్గాల వైపు మొగ్గు చూపవచ్చు. అటువంటి పద్ధతుల్లో మోసపోయే, దోపిడీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మహిళలకు ఆసరా కల్పించడమనే దృక్కోణం నుంచి చూసినా ట్రంప్ ప్రతిపాదన కల్లోలపరచేదిగానే ఉంది. ఎందుకంటే, విదేశాల నుంచి నగదు అందుకుంటున్నవారిలో మహిళలే ఎక్కువ.
కుటుంబ పోషణకు, పిల్లల ఆలనాపాలనకు వారు ఆ మొత్తాలపైనే ఆధార పడుతున్నారు. నగదు జమలపై పన్ను విధిస్తే, వారి ఆర్థిక స్థితి గతులు, ప్రగతి బలహీనపడతాయి. ఇది ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న (స్త్రీ పురుష సమానత్వ) ఐదవ ఎస్.డి.డి. లక్ష్యాన్ని నీరుగారుస్తుంది. మహిళా సాధికారత వారి ఆర్థిక సౌలభ్యంపైన కూడా ఆధారపడి ఉంది. ఈ పన్ను దానికి కోత పెట్టేదిగా ఉంది.
తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు వేయడం, తీసుకోవడం వీలయ్యే సమీకృత చెల్లింపుల వ్యవస్థ (యు.పి.ఐ.) వంటివాటి ద్వారా భారతదేశంలో ఫైనాన్షియల్ సౌలభ్యం ఒక రకంగా ప్రజా స్వామికీకరణ చెందింది. ట్రంప్ వేయదలచిన పన్ను ఆ విజయాన్ని కూడా నీరుగారుస్తుంది.
మరింత సమ్మిళిత, పరస్పరాశ్రిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన సిసలైన నవీకరణలను... డిజిటల్ జమలపై ఫెడరల్ పన్నును జోడించదలచిన ట్రంప్ చర్య నిర్వీర్యపరుస్తుంది. పేదరికం, అసమానత, వాతావరణ మార్పుపై పోరాటానికి బహుముఖ సహకారం ఎంతో అవసరమైన సమయంలో అటువంటి ఏకపక్ష చర్యలు, సొంత బాగు మాత్రమే చూసుకునే విధానాలు అంతర్జాతీయ సంఘీభావాన్ని సడలింపజేస్తాయి.
జమలకు రుసుము వసూలు చేయకుండా చూడాలనే ప్రయ త్నాలను లాభాపేక్షతో నడిచే ఫైనాన్షియల్ సంస్థలు ప్రతిఘటిస్తు న్నాయి. పెద్ద మొత్తంలో జమలు చేసే దేశం శాసనపరమైన విద్రోహా నికి కూడా పాల్పడడం వలస కార్మికులకేకాక, అంతర్జాతీయ అభివృద్ధికే నమ్మకద్రోహం చేసినట్లవుతుంది.
ఎస్.డి.జి.ల సాధనకు పెట్టుకున్న 2030 సంవత్సరపు గడువు సహాయానికో లేదా విధానానికో సంబంధించినది మాత్రమే కాదు. న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నది. జమలపై పన్ను వేసే ఎటువంటి ప్రయత్నమైనా పేదలను దోచుకోవడమే అవుతుంది. భారతదేశంతోపాటు ప్రపంచంలోని పేద దేశాలన్నీ రాజకీయ దృఢ సంకల్పంతో దీన్ని ప్రతిఘటించాలి. జమలపై పన్ను వేయాలనే ట్రంప్ నిర్ణయం అనుచిత విధానమే కాదు, వలసవెళ్ళేవారి హక్కు లకు, మరింత సమానత, స్వావలంబన ఏర్పడాలనే ప్రపంచ దార్శని కతకు ప్రత్యక్ష ముప్పు.
రెజిమన్ కుట్టప్పన్
వ్యాసకర్త కార్మిక వలసల పరిశోధకుడు, ‘అన్ డాక్యు
మెంటెడ్; స్టోరీస్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్ ది అరబ్ గల్ఫ్’ పుస్తక రచయిత ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)