ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి! | Nikhil Sharma Is One Of The Famous Moto Vlogging YouTubers | Sakshi
Sakshi News home page

జయహో.. విజయ విహారి!

Jul 5 2024 11:06 AM | Updated on Jul 5 2024 11:06 AM

Nikhil Sharma Is One Of The Famous Moto Vlogging YouTubers

ముంబైలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన నిఖిల్‌కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్‌లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్‌సైడ్‌ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.

అలా బైక్‌పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్‌సైడ్‌ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్‌’ ప్రఖ్యాత యూట్యూబర్‌లలో ఒకరిగా నిఖిల్‌ శర్మ పేరు తెచ్చుకున్నాడు.

నిఖిల్‌ ఫ్యాన్‌ బేస్‌ విషయానికి వస్తే..
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోవర్‌ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్‌కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్‌ చేయడం ద్వారా ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్‌ అయిన నిఖిల్‌ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.

వ్లాగింగ్‌కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..
నిఖిల్‌కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్‌ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఫ్లైట్‌ అటెండెంట్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్‌ వదలేయ్‌. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్‌కు ఎప్పుడూ దూరం కాలేదు.

ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్‌ ఫ్యాన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేలా చేసింది. ఔట్‌సైడ్‌ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్‌ కొరియా, జపాన్‌... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్‌ బ్రాండ్‌ లేబుల్‌ ఎంఎన్‌తో డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న నిఖిల్‌... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్‌ అనేది నా ప్యాషన్‌’ అంటున్నాడు.

ప్రతిభతో పాటు..
మన ప్యాషన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్‌ శర్మ

ఇవి చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement