
డబ్బు ఉంటేనే పెద్ద పెద్ద కలలను సాధించవచ్చు అనుకునే నేటి తరానికి అది సరికాదని, కృషి, పట్టుదల ఉంటే అన్ని హర్డిల్స్ను దాటవచ్చునని నిరూపిస్తోంది. విశాఖపట్టణవాసి జ్యోతి యర్రాజి. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా చేస్తుంటే తల్లి కుమారి కుటుంబపోషణకు ఇళ్లలో పనులు చేసేది. తన తలరాతను తనే మార్చుకుంటానని తెలియని వయసులోనే స్కూల్లో గ్రౌండ్లో పరుగులు మొదలు పెట్టింది జ్యోతి. సీనియర్ అథ్లెట్ల పరుగులు గమనిస్తూ, తన మార్గాన్ని తనే వేసుకుంది. ఆ పరుగులు జాతీయ స్థాయికే కాదు ఒలింపిక్స్ వరకు వెళ్లేలా... ఫోర్బ్స్ జాబితాలో చేరేలా చేశాయి.
దక్షిణ కొరియాలో ఈనెల 27 నుంచి జరగబోయే ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కిపోటీ పడటానికి సిద్ధపడుతోంది జ్యోతి. అందుకు ముంబయ్లోని రిలయెన్స్ అ«థ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ‘పతకాన్ని సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా’ను అని తెలిపింది.
తన రికార్డుల్ని తానే తిరగరాస్తూ...
స్కూల్ వయసులో గ్రౌండ్లో తోటి పిల్లలతో పరుగులు తీసేది.పాఠశాలకు చేరువలోనే విశాఖపోర్ట్ స్టేడియం ఉండటం, అక్కడ సీనియర్ అథ్లెట్ల్ల ప్రాక్టీస్ను పరిశీలించడం దినచర్యగా ఉండేది. తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతరపాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పతకం సాధించింది. అలా ప్రారంభమైన జ్యోతి ఎర్రాజీ ట్రాక్ ఒలింపిక్స్లోపాల్గొన్న తొలి భారతీయ ఉమెన్ హార్డిలర్గా ఖ్యాతి దక్కించుకుంది.
ట్రాక్లో గాయపడటం, జాతీయ రికార్డు నమోదును గుర్తించకపోవడం లాంటి సమస్యలనూ అధిగమించింది. పసిడి పతకాలతో జాతీయ రికార్డును తిరగరాయడమే కాదు 100 మీటర్ల హార్డిల్స్లో అర్దశతాబ్దపు భారత్ కలను నెరవేర్చింది.
మరెవ్వరూ పొటీపడలేనంతగా తన రికార్డులను తనే తిరగరాసుకుంది. కిందటేడాది ఫిబ్రవరిలో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో జ్యోతి ఎర్రాజి పేరు చేరింది. కలను లక్ష్యంగా మలుచుకొని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది జ్యోతి. – డా. సూర్యప్రకాష్ మాడిమి, సాక్షి స్పోర్ట్స్, విశాఖపట్నం