వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు | Wayanad Girl Story On Nature’s Fury Turns Real, Her Father Among Dead | Sakshi
Sakshi News home page

వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు

Aug 3 2024 3:05 PM | Updated on Aug 3 2024 4:53 PM

Wayanad girl story on nature’s fury turns real Her father among dead

కేరళలోని వయనాడ్‌ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆచూకీ తెలుసు కునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విపత్తు గురించి ఓ చిన్నారి ముందే ఊహించిందా? గత సంవత్సరం తన పాఠశాల మ్యాగజైన్‌లో, 8వ తరగతి విద్యార్థిని లయ, జలపాతంలో మునిగిపోయిన బాలిక గురించి ఒక కథ రాసింది. అచ్చం వయనాడ్‌ విధ్వంసాన్ని  పోలిన ఈ కథ  బెస్ట్‌   స్టోరీగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ ‍ స్టోరీ వైరల్‌గా మారింది.

వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుత విధ్వంసాన్ని  కళ్లకు కట్టినట్లుగా  చూపించింది. జలపాతంలో మునిగి ఒక  అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి, తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న  పెను ముప్పు గురించి హెచ్చరిస్తుంది.  

"వర్షం కురిస్తే, కొండచరియలు జలపాతాన్ని తాకుతాయి,  ఆ ధాటికి అపుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదానిని ముంచెత్తుతాయి" ఇదీ  ఆమె కథ సారాంశం. కథలో భాగంగా అనశ్వర, అలంకృత అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు  చెప్పకుండా జలపాతం చూడటానికి వెళతారు. అపుడు "పిల్లలూ ఈ  ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఆ పిల్లలు పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా ఆ పిల్లలు  జీవితాలు బలికాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. 

వయనాడ్‌ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో లయ తండ్రి లెనిన్‌ను ప్రాణాలు కోల్పోవడం విషాదం. అంతేకాదు లయ చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 497 మంది విద్యార్థుల్లో  32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెళ్లను కోల్పోయారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ ప్రాంతంలోని రెండు పాఠశాలల నుండి నలభై నాలుగు మంది పిల్లలు తప్పిపోయారు. చాలామంది విద్యార్తులు తమ స్నేహితులను కోల్పోయిన షాక్‌లో ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement