
ఈ విశ్వంలో భూమి ఉంది, కాబట్టి మనం ఇక్కడ పుట్టాం. భూమి ఉండటానికి మానవులు ఏమైనా చేశారా? లేదు, ఏదో ఒక శక్తి భూమిని సృష్టించింది. మనం పుట్టిన తర్వాత జీవించటానికి ప్రాణవాయువు అవసరం. ఆ ప్రాణవాయువు ఏర్పడటానికి మానవులేమైనా చేశారా? లేదే! ఏదో ఒక శక్తి దాన్ని పుష్కలంగా లభింపచేసింది. ఈ భూమిపైన ఎప్పుడూ గాఢాంధ కారం ఉండి ఉంటే జీవించటం సాధ్యమా? వెలుతురు ఉండాలి. ఆ వెలుతురు ఉండాలంటే సూర్యుడుండాలి. ఆ సూర్యుడు అక్కడ ఉండటానికి మనుషులు ఏం చేశారు? ఏదో ఒక శక్తి ఆ సూర్యుణ్ణి సృష్టించింది. మనం జీవించటానికి నీరు అత్యంత ముఖ్యం. మరి నీటిని మనుషులెవరైనా చేశారా? ఏదో ఒక శక్తి సముద్రాలను ఏర్పరచి వాటిని నీటితో నిల్వచేసి నిరంతరం మనకు అందుబాటులోనికి తెచ్చి పెడుతున్నది. ఆహారం తీసుకొంటేనే మనం జీవించగలం. మరి ఆ ఆహారాన్ని మనుషులెవరైనా ఏ లోకం నుంచైనా భూమిపైకి తెచ్చిపెట్టి మనకు సరఫరా చేస్తున్నారా?
మనం వివేకాన్ని వినియోగించి యోచిస్తే ఇదంతా స్వచ్ఛమైన సత్యమని తెలుస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే గ్రంథం మానవ సమాజానికి శ్రేయస్సును కలిగించేదవుతుంది. ‘అన్నాద్భవన్తి భూతాని, పర్జన్యాదన్న సంభవః.’ అంటే ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి, అన్నము మేఘము వలన కలుగుచున్నది, ఆ మేఘము యజ్ఞం వలన కలుగు చున్నది. అంత ముఖ్యమైన యజ్ఞాన్ని జరిపే బాధ్యత అల్పజ్ఞులైన మానవులపై ఉంచక ఆ దైవం ముఖ్యమైన కార్యాలన్నీ తానే జరిపించినట్లే ఆ యజ్ఞాన్ని కూడా ఆయనే జరివిస్తున్నాడని భగవద్గీత చెబుతోంది. ‘తపామ్యహమహం వర్షం నిగృహ్ణా మ్యుత్సృజామి చ’ అంటాడు భగవానుడు. ‘నేను (సూర్య కిరణములను) తపింప చేయుచున్నాను, వర్షమును కురుపించుచున్నాను, వర్షమును నిలుపుదల చేయుచున్నాను. (గీతామకరందము–శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి). మనిషి జీవించ టానికి అవసరమైన భూమి, గాలి, ఎండ, నీరు, ఆహారం అన్నీ ఆ కరుణా మయుడే సమకూర్చాడు. వాటిని కలుషితం చేయకుంటే ఆయురారోగ్యాలు కల్గుతాయి.
– రాచమడుగు శ్రీనివాసులు