
సోషల్ మీడియా మత్తు వైరస్లా పట్టి పీడిస్తోంది. రీల్స్ మోజులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా సోషల్ మీడియాకు ఎంత అడిక్ట్ అవుతున్నారనే దానికి నిదర్శనం తాజా ఘటన. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరమో సజ్జనార్ హెచ్చరించారు. పిల్లల వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.
వీసీ సజ్జనార్ ఎక్స్ పోస్ట్
చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.
సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి.
ఎక్కడ జరిగిందీ ఘటన, ముగ్గురు అరెస్ట్
ఇన్ఫ్లుయెన్సర్లలో రీల్ మానియా వారి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడవేస్తుందో చెప్పే మరో ఉదాహరణ, ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టండ్ చేశాడు. దీన్నిస్నేహితులలో ఒకరు డైరెక్ట్ చేయగా, మరొకరు వీడియో తీశాడు. ఈ స్టంట్ను చూస్తున్న చప్పట్లతో కేరింతలు కొట్టాడు. బాలుడు లేచి నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చాడు. స్నేహితులు ఆనందంతో కేకలు వేస్తుండటం చూడవచ్చు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని,భద్రతా చట్టాలను ఉల్లంఘన అని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తమ పిల్లల వ్యవహారాన్ని ఒక కంట కని పెట్టాలని తల్లిదండ్రులను కోరారు.

అయితే ట్రాక్లపై పడుకున్న బాలుడు స్పందించాడు. ఇలా చేస్తే ఈ రీల్ వైరల్ అవుతుందని తన స్నేహితులు ఈ చెప్పారని, ట్రాక్పై ఉండగా, మీదనుంచి రైలు వెళుతున్నపుడు, గుండె వేగంగా కొట్టుకుందని, బ్రతుకుతానని ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు.
కాగా వెర్రి తలలు వేస్తున్న సోషల్ మీడియా ధోరణులపై నెటిజనులను సజ్జనార్ హెచ్చరించడం ఇదే మొదటిసారి. కాదు అనేక విషయాలపై ఆయన యువతను, టీనజర్లను హెచ్చరిస్తూనే ఉంటారు. బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు నిరంతరం సూచనలిస్తూనే ఉంటారు. అంతేకాదు ఇటీవల బెట్టింగ్ యాప్లపై ప్రకటించిన యుద్ధం, దాని ప్రభావం తెలిసిన సంగతే.