ఫిష్‌.. నగర వాసుల దిల్‌ ఖుష్‌ | Telangana Federation of Fisheries Cooperative Societies | Sakshi
Sakshi News home page

ఫిష్‌.. నగర వాసుల దిల్‌ ఖుష్‌

Feb 19 2025 7:25 AM | Updated on Feb 19 2025 7:25 AM

Telangana Federation of Fisheries Cooperative Societies

నాంపల్లి: ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనలో భాగంగా మత్స్యశాఖ  సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘మన తెలంగాణ–మన చేపలు’ నినాదంతో విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపలను నగరంలో విరివిగా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదివరకే నగరంలో పలు చోట్ల చేపల విక్రయ కేంద్రాలు (ఫిష్‌ స్టాల్స్‌), సంచార విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు విభిన్న రుచులను పరిచయం చేసేందుకు ఫిష్‌ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.      

ఇప్పటి వరకూ మాసబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో ప్రయోగాత్మకంగా ఫిష్‌ క్యాంటీన్‌ను నడిపిస్తున్నారు. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి చేపల రుచులను ఆస్వాదించడానికి శాంతినగర్‌ ఫిష్‌ క్యాంటీన్‌కు వస్తున్నారు. రోజుకు 500 కేజీల చేపలను వినియోగిస్తున్నారు. ఆదివారం  వెయ్యి కేజీలు వివిధ రకాల రెసిపీలకు వాడుతున్నారు. 

వివిధ రకాలు.. 
బోన్‌లెస్‌ చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, చేపల పులుసు, అపోలో ఫిష్, ఫిష్‌ ఫింగర్స్, క్రిస్పీ రొయ్యలతో వంటకాలను తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ (పండుగ రోజు మినహా) మధ్యాహ్నం 12.30  నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్యాంటీన్‌ పనిచేస్తుంది. చేప దమ్‌ బిర్యానీ రూ.250, బోన్‌లెస్‌ ఫిష్‌ బిర్యానీ రూ.300 లకు అమ్ముతున్నారు.

రెడీ టు కుక్‌.. 
మత్స్య శాఖ రెడీ టు కుక్‌ పేరుతో ఆర్డర్లు కూడా బుక్‌ చేసుకుంటోంది. శుభకార్యాలు, వివిధ రకాల ఫంక్షన్లకు చేప వంటకాలను అందిస్తోంది. అలాగే చేపల పులుసు, రొయ్యలు, పీతల పులుసుకు కావాల్సిన చేపలను కూడా శుద్ధి చేసి సప్లయ్‌ చేస్తోంది. మత్స్య శాఖ డీజీఎం సుజాత 7989196259 ఫోన్‌ నంబరులో సంప్రదించి ఆర్డర్‌ చేసుకోవచ్చు.

ఐదు కొత్త క్యాంటీన్లు..  
నగరంలో ఐదు కొత్త ఫిష్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. గచి్చ»ౌలి, దిల్‌సుఖ్‌నగర్, శంషాబాద్, నాంపల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌లో త్వరలో ప్రారంభిస్తాం. చేప బిర్యానీ, చేప పులుసు, ఫ్రై వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభించే ఆలోచన చేస్తాం. 
– మెట్టు సాయి కుమార్‌  

Advertisement
 
Advertisement
Advertisement