మంచి మాట
జీవిత లక్ష్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి విడదీయలేనివి. సాధారణంగా మనం జీవిత లక్ష్యం అంటే లౌకిక విజయాలైన ఉద్యోగం, డబ్బు, హోదా తదితరాలే అనుకుంటాము, కానీ; ఆధ్యాత్మిక లక్ష్యం పరమార్థాన్ని వెతుకుతుంది. లౌకిక లక్ష్యాలు, సౌకర్యాలను ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక లక్ష్యం సంతృప్తిని ఇస్తుంది.
బాహ్యంగా ఎంత ఎదిగినా, అంతరంగంలో ఆధ్యాత్మికత లేకపోతే జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అందుకే, బాహ్య వృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే నిజమైన జీవిత లక్ష్యం కావాలి. లౌకిక లక్ష్యం నేను ఏమి సాధించాలి?అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది బయటి ప్రపంచంలో గుర్తింపును ఇస్తుంది. ఆధ్యాత్మిక లక్ష్యం నేను ఎవరు? అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది అంతరంగంలో శాంతిని, సత్యాన్ని వెతుకుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం’.
మానవ జన్మ అనేది సృష్టిలో అత్యంత శ్రేష్ఠమైనది. సాధారణంగా మనిషి తన జీవితాన్ని ఆహార, నిద్ర, భయ, మైథునాలతోనే గడిపేస్తుంటాడు. కానీ, వీటికి అతీతంగా నేను ఎవరు? నా పుట్టుకకు పరమార్థం ఏమిటి?– అని ఆలోచించడమే ఆధ్యాత్మికతకు తొలి అడుగు. జీవిత లక్ష్యం కేవలం భౌతిక విజయాలకు పరిమితం కాకుండా, ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవ జీవితంలో రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో సాగే ప్రయాణం, రెండోది అంతరంగంలో సాగే అన్వేషణ. చదువు, ఉద్యోగం, సంపాదన, కుటుంబం సామాజిక హోదా. ఇవి శరీరానికి, మనస్సుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యం– మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, సార్వత్రిక ప్రేమ. ఆత్మకు ఇచ్చే తృప్తి అందిస్తుంది.
భారతీయ సంప్రదాయంలో మోక్షం అనేది అత్యున్నత జీవిత లక్ష్యంగా పరిగణించబడుతుంది. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది మాత్రమే కాదు., జీవించి ఉండగానే రాగద్వేషాల నుండి, అజ్ఞానం నుండి విముక్తి పొందడం. తనలోని పరమాత్మను గుర్తించి, ప్రకృతితో మమేకమవ్వడమే ఆధ్యాత్మిక ప్రయాణ గమ్యం.. జీవిత లక్ష్యం ఒక అందమైన భవనం అయితే, ఆధ్యాత్మికత అనేది దానికి బలమైన పునాది. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, ఆధ్యాత్మికత లేని లౌకిక విజయం కూడా అంతే అస్థిరమైనది.
బాహ్యవృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే పరిపూర్ణమైన జీవన విధానం. చేతులు పనిలో ఉండాలి, మనసు భగవంతునిపై (అంతర్గత శాంతిపై) ఉండాలి. ఇదే నిజమైన యోగం. భౌతిక ప్రపంచంలో బాధ్యతలను నెరవేరుస్తూనే, అంతరంగంలో ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించుకున్నప్పుడే మనిషి జీవన యానం ధన్యమవుతుంది.
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఆధ్యాత్మికత ఇస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, ఫలితం మీద ఆశ లేకుండా కర్మను ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి తన లక్ష్య సాధనలో అధర్మానికి తావివ్వడు. సత్యం, అహింస, ధర్మం అనే పునాదుల మీద తన విజయాన్ని నిర్మించుకుంటాడు. తన ఎదుగుదల కేవలం తన కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా అని గుర్తించడం ఆధ్యాత్మికత నేర్పే గొప్ప పాఠం.
ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడటం, నిస్వార్థంగా వ్యవహరించడం. అంతటా ఆ పరమాత్మనే ఉన్నాడు అనే భావనను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత సారాంశం. ఇది మనిషిని అహంకారం నుండి విముక్తుడిని చేసి, వినయాన్ని ప్రసాదిస్తుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనిషి అనేక ఒత్తిళ్లకు, ఓటములకు లోనవుతాడు. అటువంటి సమయంలో ఆధ్యాత్మికత
ఒక దిక్సూచిలా పనిచేస్తుంది:
– ఆనంద ‘మైత్రేయ’మ్


