చెడు స్నేహానికి ప్రతీక శకుని | Shakuni is the embodiment of bad Relations | Sakshi
Sakshi News home page

చెడు స్నేహానికి ప్రతీక శకుని

Jun 8 2026 5:28 AM | Updated on Jun 8 2026 5:28 AM

Shakuni is the embodiment of bad Relations

భారత విజ్ఞానం

మహాభారతయుద్ధంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దుష్టచతుష్టయంలో ఒకరుగా పేరుగాంచి, కౌరవులకు మేనమామగా, వారిలో యువరాజైన దుర్యోధనునికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి అన్నీ తప్పుడు సలహాలు, సూచనలిచ్చి కౌరవులకు కీడు తలపెట్టడంతో, పాండవులకు మేలు జరిగేది. శకుని ఉద్దేశ్యం కూడా ఇదే. 

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న కాంధహార్‌ ఆనాటి గాంధార దేశం. గాంధారదేశపు రాజు సుబలుడు, రాణి సుధర్మల కుమారుడే శకుని. సుబలునికి వందమంది కుమారులు, గాంధారి అనే కుమార్తె ఉన్నారు. అందరిలో ఆఖరివాడే శకుని. ఇతని అసలు పేరు సుబలోత్తముడు. అపారమైన తెలివితేటలు కల్గిన, శకుని ‘చౌసర్‌’ అనే మాయా జూదపు ఆటలో మంచి నేర్పరి. 

శకుని ప్రాణప్రదంగా అభిమానించే తన సోదరి గాంధారిని, కౌరవ సామ్రాజ్యాధీశుడు, పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడికి పట్టమహిషిగా చేయాలని భీష్ముడు భావించాడు. అయితే జాతకం ప్రకారం గాంధారికి వైధవ్య యోగం ఉందని తెలిసిన శకుని తన సోదరి అంటే ఉన్న వల్లమాలిన అభిమానంతో, ఈ విపత్తు నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో, జ్యోతిష్యుల సూచనలు, సలహాల మేరకు గాంధారికి మొదటగా ఓ మేకతో వివాహం జరిపించి, అనంతరం ఆ మేకను బలిచ్చి ఆపై ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేస్తే ఆ దోష పరిహారం అవుతుందని ఆ విధంగా చేశాడు. 

వివాహానంతరం ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆగ్రహం చెంది సుబలుని కుటుంబాన్ని చెరశాలలో బంధించి, మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు. చెరసాలలో ఉన్న సుబలుని కుటుంబానికి ఇచ్చే ఆహారం ఒక్కరికి మాత్రమే సరిపోయేది. మిగిలిన సోదరులు ఆహారాన్ని తమలో తెలివైన, ఆఖరి సోదరుడైన శకునికే పెట్టి ఎలాగైనా కౌరవులపై పగ తీర్చుకోవాలని ప్రమాణం చేయించుకున్నారు. 

అనంతరం క్షుద్బాధతో తండ్రి, ఒక్కొక్క సోదరుడు మృతి చెందారు. తన తండ్రి మరణానంతరం అతని తొడ ఎముకతో తయారైన పాచికలను వినియోగిస్తూ, తాను అనుకున్న సంఖ్య పడేలా శకుని వరం పొందాడు. ఆ పాచికలతో శకుని మాయాజూదం ఆడి మోసపూరితంగా పాండవులను ఓడించి, కౌరవులచే మరిన్ని అన్యాయాలు, అక్రమాలు చేయిస్తూ మహాభారత యుద్ధం జరిగేలా పథకం రచించి కౌరవవంశాన్ని నాశనం చేసాడు. అయితే మహాభారత యుద్ధంలో ఆఖరిరోజున (18వ రోజు)సహదేవుని చేతిలో శకుని మరణించాడు. 

ఇదిలావుండగా శకునికి కూడా గుడి ఉంది. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం వద్ద శకునికి ఆలయం నిర్మించారు అక్కడి కురువర్‌ తెగ ప్రజలు. అయితే అక్కడ ఏ విధమైన శకుని విగ్రహం ఉండదు.

– సి.ఎన్‌. మూర్తి
సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
Advertisement