
3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు
వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ
తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం
మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు
మేడారం గద్దెలు, సాలహారం,నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు
కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. – ఎస్ఎస్తాడ్వాయి
ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు.
అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు
ఇది దేశ పురోగమన చరిత్ర
సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్
సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్
జంపన్న ప్రత్యేకం
పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాస్త్రీయబద్ధంగా పూజారులు తీసుకున్నారు.
ప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు.

40 ఫీట్ల ఎత్తుతో ప్రధాన ద్వారం
ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు.
ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది.
ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు.
చదవండి: పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?