వరంగల్: రైలుకు ఎదురెళ్లి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై గురువారం రాత్రి భార్యాభర్తలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపిన వివరాల మేరకు... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగె రవి (42), శిరీష (33) దంపతులు. వారికి 12, 13 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలున్నారు.
నగరానికి వచ్చిన వారు పెద్దఅంబర్పేట పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. భర్త బియ్యం వ్యాపారి, భార్య గృహిణి. గురువారం రాత్రి కృష్ణా ఎక్స్ప్రెస్కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాలు స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, రవి, శిరీషల ఆత్మహత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని, వారు నివాసముంటున్న చోట ఓ వ్యక్తి, అతడి భార్య కలిసి రవి, శిరీష దంపతులను వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారని బంధువులు పేర్కొన్నారు.
భాగస్వామ్యం ఇవ్వకపోగా, ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరించడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘నేను, తమ్ముడు బడికి వెళ్లాం. మేం వచ్చేసరికి అమ్మానాన్న ఇంట్లో లేరు. రాత్రవుతున్నా రాలేదని వారికి ఫోన్ చేస్తే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. మంచిగా చదువుకోండి...ఇద్దరు కొట్టుకోవద్దు’అని చెప్పారని, ఆ తర్వాత వెంటనే ఫోన్ కట్ అయ్యిందని రవి పెద్ద కుమారుడు సుశాంత్ తెలిపాడు.


