సాక్షి, వరంగల్: వరంగల్లోని భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రమాణాల పేరుతో ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో, ఆలయం మైల పండిందని బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ శుద్దికి కాషాయ పార్టీ నేతలు అక్కడికి వెళ్లారు. అనంతరం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. భద్రకాళి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. దీంతో బీజేపీ నేతలు భద్రకాళి ఆలయం ఎదుట నిరసన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా వేలం విషయంలో అవినీతికి పాల్పడ్డాయి. అలాంటి ఆ పార్టీ నాయకులు పవిత్రమైన భద్రకాళి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణాలకు రావడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే భద్రకాళి దేవాలయంలో రాజకీయ పార్టీల నిరసనలు భక్తుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజకీయాలకు పవిత్ర దేవాలయాలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


