
యూట్యూబ్ నుంచి నటిగా మారిన ప్రజక్తా కోలి మోస్ట్లీ సేన్ అనే యూట్యూబ్ ఛానెల్తో దేశంలోనే తొలి మహిళా కామెడీ కంటెంట్ క్రియేటర్గా పేరుతెచ్చుకుంది. రోజువారీ జీవితంలోని పరిస్థితుల గురించి మంచి టైమింగ్ కామెడీ వీడియోలతో యువతను ఆకర్షించింది. అంతేగాదు నెట్ఫ్లిక్స్ సిరీస్ మిస్మాచ్డ్ లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
దాంతోపాటు జగ్ జగ్ జీయో" చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్లో చోటు దక్కించుకుంది. ఇలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంటెంట్ క్రియేటర్ కూడా ఆమెనే కావడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో జిమ్మీ డోనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), ఖబానే లేమ్, కై సెనాట్, మెల్ రాబిన్స్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ మేరకు ఈ ప్రజక్తా కోలి తన ఆనందాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. ఈ అత్యున్నత గౌరవం లభించినందుకు ముందుగా ప్రేక్షకులకు, నా కుటుంబ సభ్యులకు ధన్యావాదాలు. ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం కథల పట్ల ఉన్న అవగాహనతో సంపాదించుకున్న స్టార్ డమ్ ఇది. మీ అందరి సహకారం వల్ల ఇదంతా సాధించానని పోస్ట్లో రాసుకొచ్చింది.
కెరీర్ మొదలైంది ఇలా..
పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. ఆర్జేగా ఆమె చేసిన హృతిక్ రోషన్ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అదివిన్న ‘వన్ డిజిటల్’ యూట్యూబర్ సుదీప్ ఆమెను యూట్యూబ్ చానెల్ పెట్టమని ప్రోత్సహించాడు.
అలా 2015లో ‘మోస్ట్లీ సేన్’ను లాంచ్ చేసింది. ‘10 హిలేరియస్ వర్డ్స్ దట్ డిల్లీ పీపుల్ యూజ్’ అనే వీడియోతో ఆ చానెల్ క్లిక్ అయింది.
యూట్యూబ్ చానెల్స్ తొలినాళ్లలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్ అనే పేరు సంపాదించుకుంది. సాధించింది.
సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్ నేషన్స్ వరకు చేరింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్ స్క్రీన్ చేసింది.
ప్రజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి.
‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి.
అంతేగాదు న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అలాగే యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్గా ఎదిగింది. ఇవన్నీ ఆమె కేవలం తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది.
ఇటీవలే యూట్యూబ్ ‘గ్లోబల్ ఇనిషీయేటివ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్’కి ఇండియన్ అంబాసిడర్గా ఎన్నికైంది కూడా.
ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్కు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రజక్తకు చలనచిత్ర, వెబ్పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్తో పరీక్షించుకుంది. సూపర్ హిట్ అయింది
ఈ ఏడాద ప్రారంభంలో, ఆమె తన తొలి నవల టూ గుడ్ టు బి ట్రూ విడుదలతో కథకురాలిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఇక ప్రజక్తా కోలి ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ, జీక్యూ ఇండియా అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితా 2025 వంటి వాటిల్లో కూడా చోటు దక్కించుకున్నారు.
(చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...)