‘పిల్లల్ని కనడానికి ముందు పేరెంటింగ్ క్లాసులో చేరాలా?’ ‘తప్పనిసరి’ అంటున్నారు ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్ చైర్మన్, పర్యావరణవేత్త మేఘన ముసునూరి. ఇద్దరి కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు...
‘‘పెళ్లి కాగానే మావారి ఉద్యోగరీత్యా యూకే వెళ్లాం. పిల్లలను కనడానికి ముందు వాళ్ల పెంపకం పట్ల ఆందోళన ఉండేది. నేను చదువుకున్న చదువులో ఈ సబ్జెక్ట్ ఎక్కడా లేదు. అందుకే, పేరెంటింగ్ క్లాస్లకు వెళ్లి, పిల్లలను ఎలా చూసుకోవాలో నేర్చుకున్నాను. కిండర్గార్టెన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ నీడ్స్ పిల్లలతో కలిసి వర్క్ చేశాను.
ఆ నాలుగేళ్లలో ఎలాంటి పిల్లలు పుట్టినా, వారిని బాగా చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకొని, పిల్లల్ని కన్నాను. ఇద్దరు కూతుళ్లు తీర్థ, బిల్వ. ఇండియాలో ఉన్నప్పుడు నా చిన్నతనంలోని ఎంజాయ్మెంట్ గుర్తుకు వచ్చింది. ఇవేవీ మా పిల్లలు అనుభవించడం లేదని, నేను, మా వారు ఒక నిర్ణయం తీసుకొని, ఇండియాకు వచ్చేశాం.
స్కూల్ స్టార్ట్ చేశాను
హైదరాబాద్లో ఇల్లు తీసుకొని, సాఫ్ట్వేర్ రంగంలో మా వారు స్థిరపడ్డాక నేను కొంత ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు నేర్చుకున్నదాన్ని అమలులో పెట్టాలని అనుకున్నాను. ‘సేవ్ వాటర్’ ఎన్జీవోను స్టార్ట్ చేశాను. నాతో పాటు నా పిల్లలు కూడా నా వెనకాలే తిరుగుతుండేవారు. ప్రతి ఆదివారం కాలనీ పిల్లలతో ‘సేవ్ నేచర్’ పేరుతో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించేదానిని. పిల్లల చేత పెద్దవాళ్లకు ‘సేవ్ వాటర్’ గురించి చెప్పించేదాన్ని. మియాపూర్లో ‘ఫౌంటెన్హెడ్ గ్లోబల్’ కిండర్గార్టెన్ స్కూల్ స్టార్ట్ చేశాను. స్కూల్లో ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. నా పిల్లలు కూడా నా స్కూల్లోనే చదువుకున్నారు.
పిల్లలూ మొక్కలూ ఒకటే!
స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలతో మమేకం అయి చేసే పనులు వారు ఎలా గమనిస్తుంటారో, నేర్చుకుంటారో నాకు కొన్నాళ్లకే అర్థం అవుతూ వచ్చింది. ఒక రోజు తొమ్మిదేళ్ల మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి, క్యాన్సర్ పేషంట్స్ కోసం తన పొడవైన జుట్టు డొనేట్ చేస్తానని చెప్పింది. అక్కను చూసి చెల్లెలూ ఇస్తానంది. క్యాన్సర్ సెల్ గురించి చదివామని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని పిల్లలిద్దరూ చెప్పారు. ఓ రోజు మా చిన్నమ్మాయి ‘సమ్మర్లో ఎందుకింత వేడిగా ఉంటోంది’ అని అడిగింది. ‘మా చిన్నప్పుడు ఇంత వేడి లేదు. చెట్లు పెంచితే వేడి తగ్గుతుంది’ అని చెప్పాను.
అప్పటి నుంచి పిల్లలిద్దరూ కాలనీలలో మొక్కలను పెంచడం, పంచడం మొదలుపెట్టారు. పంచే ప్రతి మొక్కకు మూడేళ్లు వచ్చేవరకు ‘మేం జాగ్రత్తగా పెంచుతాం’ అనే ప్రతిజ్ఞ పేపర్ రాయించుకొని, మరీ ఇచ్చేవారు. దాదాపు 60 వేల మొక్కలు పంచారు. ఇంట్లో పొదుపుగా సహజవనరులను వాడటం, ప్రాక్టీస్ చేయించడం వల్ల ఇవన్నీ పిల్లలకు అలవడ్డాయి. మొక్కలను ఎంత జాగ్రత్తగా పెంచితే నీడనిచ్చే వృక్షాలు అవుతాయో, పిల్లలూ అంతే!.
పర్యావరణం గురించి నేర్పుతూ!
నేను ఏం చెప్పినా ఎన్విరాన్మెంట్, నేచర్ గురించి చెప్పేదాన్ని. అది వారికి బాగా వంటపట్టింది. స్కూల్పిల్లలతో కలిసి మా ఏరియాలోని మీది కుంట చెరువు శుభ్రతకు కృషి చేశాం. మా పెద్దమ్మాయి చెరువు శుభ్రత కోసం తన పాతికలక్షల చెక్ డొనేట్ చేసింది. దీంతో మా చిన్నమ్మాయి వాళ్ల నాన్నతో కలిసి చెరువు చుట్టూ పార్క్ ఏరియా ఏర్పాటుకు కృషి చేసింది. కరోనా సమయంలో పిల్లలు ‘ఓజోన్ రన్’ చేశారు. ఆ తర్వాత కాలనీలలో 100 డేస్ క్లీనప్ సెషన్స్ నిర్వహించారు.
ఇప్పుడు మా పెద్దమ్మాయి లండన్లో పబ్లిక్ హెల్త్పై ఎడ్యుకేషనల్ రీసెర్చ్ చేస్తోంది. చిన్నమ్మాయి బిల్వ హైదరాబాద్లోనే కార్బన్ టాక్సేషన్ కోర్సులో చేరింది.
పిల్లల పెంపకంలో ప్రతి తరానికి ఫార్ములా మారుతుంటుంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్, పర్ఫెక్ట్ పేరెంట్ అంటూ ఉండరు. పేరెంట్ అవ్వాలనుకునే ముందు పేరెంటింగ్ క్లాసులు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే సరైన అవగాహనతో పిల్లలను పెంచగలం’’ అని వివరించారు ఈ పర్యావరణవేత్త.
సొంతంగా ఎదిగేలా!
మా పెద్దమ్మాయి తీర్థ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొంది. పాతిక లక్షల రూపాయల బహుమతి తెచ్చుకుంది. చిన్నమ్మాయి నేను కూడా ఆ ప్రోగ్రామ్లో పాల్గొంటాను అంది. అప్పుడు తన ఏజ్ 9. అండర్ ఏజ్ వాళ్లకు అవకాశం లేదని చెప్పాను. దీంతో తను కూడా సంపాదిస్తానని టీచర్స్తో మాట్లాడి ఒక మెనూ రూపొందించి, స్కూల్లో ఒక ఫుడ్ కార్నర్ స్టార్ట్ చేసింది. డబ్బు గురించి కాదు వాళ్లకున్న ప్యాషన్ని పరిచయం చేయాలనుకుని, ఫుడ్ కార్నర్ ఏర్పాటుకు ఎంకరేజ్ చేశాను.
ఆ సమయంలో కలినరీ లాంజ్లో పెద్ద పెద్ద షెఫ్స్కి హాండీటాక్స్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మా చిన్నమ్మాయి బిల్వను అక్కడ పరిచయం చేశారు. దీనికి బ్రిటిష్ హై కమిషన్ ‘యంగెస్ట్ ఫుడ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ హైదరాబాద్’ అని ట్వీట్ చేశారు. పిల్లలు ఆడంబరాలకు పోకుండా పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాను.
నిర్మలారెడ్డి
(చదవండి: చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!)


