అలాంటి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం..! | Legal Advice: These Things To Know Before Investing In Stocks | Sakshi
Sakshi News home page

అలాంటి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం..!

Jan 29 2025 11:11 AM | Updated on Jan 29 2025 11:31 AM

Legal Advice: These Things To Know Before Investing In Stocks

నేను ఒక విశ్రాంత ఉద్యోగిని. నా సర్వీస్‌ మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుని ఒక ప్రైవేటు స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీ వారు లిస్టింగుకు సిద్ధంగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ వస్తుందని నమ్మించడంతో అందులో పెట్టుబడులు పెట్టాను. 18 నెలల లోపు సదరు కంపెనీలు స్టాక్‌ లిస్టింగ్‌ అవ్వకపోతే, తామే తిరిగి మా స్టాక్‌ కొనుక్కుంటాము అని అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు. నాలాగే చాలామంది చేత కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది కానీ ఏం లాభం లేదు పైగా మా స్టాక్‌ అమ్మేస్తాము అంటే తిరిగి కొనుక్కోవట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పగలరు.
– ఒక విశ్రాంత ఉద్యోగి, హైదరాబాద్‌ 

పూర్వ అనుభవం, వ్యాపార పెట్టుబడులలో నైపుణ్యం కలిగిన వారు అన్‌లిస్టెడ్‌ షేర్లు కొంటూ ఉండటం, స్టార్టప్‌ కంపెనీలలో ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక వ్యాపారమే. ఏంజెల్‌ ఇన్వెస్టర్స్, క్యాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ అంటూ వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ పద్ధతులు అవలంబిస్తుంటారు. నచ్చిన సంస్థలలో వారు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది వారి హక్కు.

అన్‌లిస్టెడ్‌ కంపెనీలలో కొన్న షేర్లకు రిస్కు కూడా అధికంగానే ఉంటుంది. దీనిని ఒక వ్యాపారం లాగా చేసే వారు నష్టాలకు కూడా సిద్ధపడి పెట్టుబడులు పెడుతుంటారు. కానీ మీలాగా జీవితం మొత్తం కష్టపడి సంపాదించి రిటైర్‌ అయిన తర్వాత, కేవలం లాభాలు ఆశించి మాత్రమే అధిక మొత్తంలో ఇలాంటి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. 

స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ ఐన కంపెనీలు ఏమైనా ఆర్థిక నేరాలు చేసినా, అవకతవకలు జరిగినా, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కంపెనీ నష్టపోతే లేదా దివాలా తీస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. 

మీకు అగ్రిమెంట్‌ రాసి ఇచ్చింది మీరు షేర్లు కొన్న కంపెనీ అయి ఉండి, మీకు, సదరు కంపెనీ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలకు మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే, మీరు కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌  ద్వారా కూడా కేసు వేయవచ్చు. మీకు అగ్రిమెంట్లు చేసింది మధ్యలో వున్న బ్రోకింగ్‌ కంపెనీ అయితే, NCLTని ఆశ్రయించలేరు. 

ఇటీవలే ఒక కంపెనీ వారు మీలాంటి వారి వద్ద అధిక మొత్తంలో పెట్టుబడులను సేకరించి, అగ్రిమెంట్లు చేసి కూడా ఎవరికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో కేసు నమోదయి, కొందరిని అరెస్టు కూడా చేశారు. ఆ కేసు ఇంకా విచారణ దశ లోనే ఉంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. మీరు ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారు, వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే దిశలో దర్యాప్తు చేయవలసిందిగా కోరండి. సివిల్‌ కేసు ద్వారా కూడా మీ డబ్బులు తిరిగి పొందవచ్చు.

గమనిక ఇటీవల కాలంలో ఒక్క హైదరాబాదులోనే సైబర్‌ నేరగాళ్లు కూడా స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అంటూ చాలా కేసులే నమోదయ్యాయి. ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అనుభవం కలిగిన వారి సలహా మేరకు, చట్టరీత్యా చేస్తే మంచిది.
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు. )

(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement