ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు | Kerala homemaker Bindu Vinosh turned entrepreneur by launching Webscicle | Sakshi
Sakshi News home page

ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు

Nov 24 2024 12:51 AM | Updated on Nov 24 2024 12:51 AM

Kerala homemaker Bindu Vinosh turned entrepreneur by launching Webscicle

మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్‌ గ్యాప్‌కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్‌ పడిలేచిన కెరటంలాగ  సొంత కంపెనీ స్థాపించారు. బిందు స్థాపించిన వెబ్‌సికిల్‌ ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతోంది.

కేరళకు చెందిన బిందు వినోష్‌ ఎంసీఏ చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దశాబ్దానికి పైగా ఇల్లే ప్రపంచంగా ఉండిపోయారామె. నలభై ఏళ్లు దాటేటప్పటికి ఐటీ రంగం మీదున్న ఇష్టం ఆమెను తిరిగి కెరీర్‌ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించింది. 

44 ఏళ్ల వయసులో ఓ పెద్ద ఐటీ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీకి, ఆఫీస్‌ ఏర్పాటు చేయడానికి 16 లక్షలతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అనతికాలంలోనే సొంతంగా వెబ్‌సికిల్‌ ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీని ప్రారంభించారు. 2023లో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఆమె వ్యాపార సంస్థ ఇప్పుడు ఏడుగురు నిపుణులతో ఏడాదికి పాతిక లక్షలతో నడుస్తోంది. 

వెబ్‌సికిల్‌ ఐటీ రంగంలో వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌తోపాటు కస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సికిల్‌ సేవలందుకుంటున్న క్లయింట్‌లలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు పాతిక వరకు ఉన్నాయి. నేడామె ఐటీ సంస్థకు యజమానిగా కొత్తగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.                               
 

Advertisement
 
Advertisement
Advertisement