చైతన్యం, అవగాహన కల్పిస్తున్న బోరబండ హెడ్ కానిస్టేబుల్ మనోహర్
సాక్షి, హైదరాబాద్: తనదైన శైలిలో పాటలు పాడుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు బోరబండ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మనోహర్. గత ఫిబ్రవరిలో జహీరాబాద్ నుంచి బోరబండకు బదిలీపై వచ్చారు. ఇటు విధి నిర్వహణతో పాటు పాటలు ఆలపిస్తూ ప్రజల, అధికారుల మన్ననలు పొందుతున్నాడు. డ్రగ్స్ అవగాహన సదస్సుల్లో, ఇతర చైతన్య కార్యక్రమాల్లో తనదైన శైలిలో పాడుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు..
నెటిజన్ల మన్ననలు..
జహీరాబాద్ మండలం హుగ్గోల్లి గ్రామానికి చెందిన మనోహర్ చిన్ననాటి నుంచే పాటలు పాడుతూ, హర్మోనియం నేర్చుకున్నాడు. తమ గ్రామీణ ప్రాంతాల్లో వేసే వీధి నాటకాలను చూసి మరింత ఆశక్తి పెంచుకున్నాడు. 2004లో పోలీస్ ఉద్యోగంలో చేరి తొలుత జహీరాబాద్లోని పలు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించి తనదైన పాటలతో పోలీసు అధికారులను, ప్రజలకు ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అజేయ సెంచరీ
ఈ క్రమంలోనే జహీరాబాద్ ఎస్సీ చంద్రశేఖర్రెడ్డిచే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొంది బోరబండ పీఎస్కు బదిలీపై వచ్చారు. బోరబండ డివిజన్ భౌగోళిక పరిస్థితులపై అప్పటికప్పుడు ఆయన పాడిన పాటలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ, నెటిజన్లలతో పాటు పోలీస్ అధికారుల మన్ననలు అందుకుంటుంది.
సంగీతం సైతం సమకూర్చుతూ..
బాల్య వివాహాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు లాంటి చైతన్య గీతాలు పాటడమే కాకుండా తానే స్వయంగా సంగీతం సమకూర్చుతారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో పాటలు పాడిన మనోహర్ ఆ పాటలకు సంగీతం తానే సమకూర్చారు. ఈ సందర్భంగా మనోహర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత గేయాలపై ఉన్న మక్కువ తనను గాయకుడిని చేసిందన్నారు. ప్రధానంగా కవి గోరటి వెంకన్న గ్రామీణ ప్రాంత పాటలు ప్రభావితం చేశాయన్నారు. తాను పాడిన పాటలు కొన్ని ప్రస్తుతం రికార్డింగ్ ప్రక్రియలో ఉన్నాయని మనోహర్ స్పష్టం చేశారు.


