తుక్కుగూడలో ‘ఆర్జీకర్‌’ తరహా అఘాయిత్యం | Tukkuguda Nurse Case: RG Kar Like Horror Suspected in Hyderabad | Sakshi
Sakshi News home page

తుక్కుగూడలో ‘ఆర్జీకర్‌’ తరహా అఘాయిత్యం

Aug 31 2026 10:38 AM | Updated on Aug 31 2026 11:48 AM

Tukkuguda Nurse Case: RG Kar Like Horror Suspected in Hyderabad

సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా మెకానిక్‌గా పని చేసే సనావుల్లా ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అంతేకాదు.. మృతదేహంపై కూడా లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. దీంతో ఈ ఘటనకు.. కోల్‌కతాలో జరిగిన సంచలన ఆర్జీకర్‌ ఆస్పత్రి ఘటనను పోలిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.

ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్‌లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ కారణంతో రూమ్మేట్స్‌ ఊరెళ్లగా.. శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్‌ పోలీసులు.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో అత్యాచారం, హత్య కోణంలో విచారణ చేపట్టారు. స్థానికంగా పని చేసే మెకానిక్‌ మహ్మద్‌ సనావుల్లా(34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.

కిటికీ గ్రిల్స్‌ లేకపోవడంతో..
ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ల మెకానిక్‌ షాపులో బిహార్‌కు చెందిన సనుహుల్లా (34) పనిచేస్తున్నాడు. ఇతర కార్మికులు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను కొంతకాలంగా గమనించినట్లు తెలుస్తోంది. యువతి(21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో.. బయటకు శబ్దం వినిపించకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

నిందితుడు సనావుల్లా ఖాన్‌

పోలీసుల అదుపులో నిందితుడు
అంతకు ముందు.. పోలీసుల ముందే నిందితుడు సనావుల్లా ఖాన్‌ దర్జాగా తిరిగాడు. డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో తనిఖీలు జరుపుతున్న టైంలో.. ఏం జరిగింది? అంటూ పోలీసులనే ఆరా తీశాడతను. అయితే జాగిలాలు నేరుగా మెకానిక్‌ షాపు దగ్గరకే వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈలోపు.. నేరం జరిగిన అర్ధరాత్రి నిందితుడు తనకు పదే పదే కాల్‌ చేశాడని షాపు యాజమానికి పోలీసులకు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా సనావుల్లా ఖాన్‌ నేరం అంగీకరించాడు. 

ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే నిందితుడు రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. 

కుటుంబ సభ్యుల ఆందోళన
మరోవైపు యువతి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు తరలి వచ్చారు.

ఆర్జీకర్‌ ఘటనలో ఏం జరిగింది?
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో జరిగిన ఘటన.. యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అర్ధరాత్రి 31 ఏళ్ల ట్రెయినీ డాక్టర్‌ మృతదేహం లభించింది. ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంజయ్‌ రాయ్‌ అనే సివిక్‌ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజా తుక్కుగూడ ఘటనలోనూ అర్ధరాత్రే.. అదీ ఆస్పత్రి ఆవరణలోనే అఘాయిత్యం జరగడం గమనార్హం.

ఇదీ చదవండి: నీట్‌ కొట్టింది.. అంతలోనే ఆనందం ఆవిరైంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement