దోమలు దమ్ము దమ్ము చేస్తున్నాయ్‌! మా నెత్తురు పీలుస్తున్నాయ్‌! | Hyderabad Mosquito Menace Dengue Malaria GHMC | Sakshi
Sakshi News home page

దోమలు దమ్ము దమ్ము చేస్తున్నాయ్‌! మా నెత్తురు పీలుస్తున్నాయ్‌!

Aug 31 2026 12:15 PM | Updated on Aug 31 2026 12:19 PM

Hyderabad Mosquito Menace Dengue Malaria GHMC

మహా నగరంలో దోమల దండు

ఇళ్లలో.. ఖాళీ ప్రదేశాల్లో కుప్పలు కుప్పలుగా..

వ్యాధులతో ఆస్పత్రులకు బాధితుల క్యూ

ఫాగింగ్‌ పట్టని ఎంటమాలజీ విభాగం

దోమలు దమ్ము దమ్ము చేస్తున్నాయి. దొంగచాటుగా వచ్చి చిటుక్కున కుడుతున్నాయి. వెంటపడి మరీ రక్తం పీల్చేస్తున్నాయి. గాలిలో ఎగురుతూ దొరకకుండా తప్పించుకుంటున్నాయి. చూస్తే మశకమే కానీ చెట్టంత మనిషిని  ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అసహనానికీ గురి చేస్తున్నాయి. ఇంటిలో, ఆరుబయట కాసేపు ప్రశాంతంగా ఉందామన్నా వీలు పరిస్థితుల్లో నగర వాసులు దోమల బారిన పడి బేజారుమంటున్నారు.

దోమల భయంతో ఇంట్లో తలుపులు, కిటికీలు మూసేయాల్సిందే. రోడ్డున నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి తలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఇదీ ప్రస్తుతం మహా నగరంలో పరిస్థితి. మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీల్లో దోమల సమస్య మరింత జటిలంగా ఉంది. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బందిలో చలనం లేదు. – సాక్షి, హైదరాబాద్‌ 

నగరంలోని మురుగు కాల్వలు (నాలాలు), మూసీ నది పరీవాహక ప్రాంతాలు, ఓపెన్‌ డ్రెయిన్లు, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలు, ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. పలు కాలనీల్లో రహదారిపై నీరు నిలుస్తోంది. మరికొన్ని చోట్ల మురుగు వరద పారుతోంది. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగక దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, షేక్‌పేట్, ఓల్డ్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లోని సమస్య మరీ దారుణంగా ఉంది. ఫలితంగా సీజనల్‌ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్‌ జ్వరాల కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వ్యాధుల బారినపడి తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఇటీవల జ్వర బాధితుల సంఖ్య భారీగా పెరిగిందని నిలోఫర్‌ వైద్యులు చెబుతున్నారు.

శాఖల మధ్య సమన్వయ లోపం.. 
గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. లార్వా నివారణ చర్యలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దోమల నివారణ బాధ్యతలు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం పరిధిలో ఉంది. దోమలు పెరుగుతున్నాయంటే రెండు శాఖలు మేం బాగానే పనిచేశాం. వాళ్లదే తప్పుఅన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులున్న కాలనీల్లో ఫాగింగ్‌ కార్యక్రమాలు కొంత వరకు మెరుగ్గా ఉన్నా.. ఇతర ప్రాంతాలకు ఫాగింగ్‌ యంత్రం వచి్చన సంఘటనలే లేవు. వాస్తవ పరిస్థితిని గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌.. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఆచరణకు దిగితే ప్రజల కష్టాలకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: నేటితో ఆఖరు.. గ్యాస్‌, రేషన్‌, చేయూతకు ఈ-కేవైసీ చేశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement