ప్రకృతిని గౌరవించడం మన సంస్కృతి | Gurudev Sri Sri Ravi Shankars Message on Environmental Protection | Sakshi
Sakshi News home page

ప్రకృతిని గౌరవించడం మన సంస్కృతి

Jun 5 2026 6:25 PM | Updated on Jun 5 2026 7:37 PM

Gurudev Sri Sri Ravi Shankars Message on Environmental Protection

పర్యావరణ పరిరక్షణ గురించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ కొన్ని అమూల్యమైన విషయాలను పంచుకున్నారు. పర్యావరణంతో మన అనుబంధమే మానవ అనుభవంలో తొలి స్థాయి. మన చుట్టూ ఉన్న వాతావరణం పరిశుభ్రంగా, సానుకూలంగా ఉంటే, అది మన జీవితంలోని మిగతా అన్ని స్థాయిలపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

చరిత్రపరంగా చూస్తే, పర్యావరణంతో సన్నిహిత సంబంధం మానవ మనస్తత్వంలో సహజంగానే అంతర్లీనంగా ఉండేది. ప్రకృతితో, అలాగే మనతో మనం ఉన్న అనుబంధం నుండి దూరమవడం ప్రారంభించినప్పుడే పర్యావరణాన్ని కలుషితం చేయడం, నాశనం చేయడం మొదలైంది.

భారతదేశంలో సంప్రదాయంగా ప్రకృతిని ఆరాధించారు. ఆ క్రమంలోనే పర్వతాలు, నదులు, వృక్షాలు, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అన్నీ పూజించేవారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతి పట్ల ఇదే విధమైన గాఢమైన గౌరవాన్ని ప్రదర్శించాయి. నేడు మానవ మనస్సును ఒత్తిడి, అత్యాశ నుంచి విముక్తం చేసి, ప్రకృతి పట్ల ఆ గౌరవభావాన్ని తిరిగి తీసుకురావడం అత్యవసరమైంది. 

మా పరిశోధనా కేంద్రంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ధ్యాన సాధనలకు  పర్యావరణ పరిరక్షణలో “సామూహిక ప్రభావం” మెరుగుపడటానికి సంబంధం ఉందని తెలిసింది. “సామూహిక ప్రభావం” అంటే సమాజం నుంచి వచ్చే భాగస్వామ్యం, పర్యావరణం పట్ల వారి ప్రవర్తనలో వచ్చే సానుకూల మార్పు.

పంచభూతాలన్నీ ఒకదానితో ఒకటి అత్యంత సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కలుషితమైనా మిగిలిన నాలుగు కూడా ప్రభావితమవుతాయి. పంచభూతాలలో కలిగే కాలుష్యాన్ని విడివిడిగా చూడలేం. ఉదాహరణకు, ఒక ప్లాస్టిక్ ముక్కను కాల్చితే అది కేవలం భూమినే కాదు, గాలినీ కలుషితం చేస్తుంది. అదే దాన్ని నీటిలో పడేస్తే, అది నీటిని కూడా అంతే స్థాయిలో కలుషితం చేస్తుంది.

వృక్షాలను భూమి ఊపిరితిత్తులు అని సరైన రీతిలో పిలుస్తారు. అందువల్ల మనం మరిన్ని చెట్లను నాటాలి. ప్రాచీన శాస్త్రాలలో ఒక చెట్టును నరికినవాడు ఐదు చెట్లను నాటాలని చెప్పబడింది. ప్రకృతి నుంచే స్థిరమైన సహజీవనం గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నప్పటికీ, అవి మనుషుల మాదిరిగా చెత్తను వెదజల్లవు. 

ప్రకృతిని పరిశీలిస్తే, అందులోని పంచభూతాలు పరస్పరం విరుద్ధ స్వభావాలు కలిగినవే; జంతు ప్రపంచంలో కూడా ఒకదానికొకటి శత్రుత్వంగా ఉండే జాతులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రకృతిలో ఒక అద్భుతమైన సమతుల్యత నెలకొని ఉంటుంది. వానపాములు ప్రకృతి వ్యర్థాలను ఎలా జీర్ణించి, వాటిని మళ్లీ జీవనాన్ని నిలబెట్టే వనరులుగా మారుస్తుందో చూపించే అద్భుత ఉదాహరణ.

పర్యావరణం పట్ల సున్నితత్వం మన జీవితం దానితో ఎంతగా ముడిపడి ఉందో గ్రహించినప్పుడు సహజంగానే వస్తుంది. ఉష్ణోగ్రతలో కొన్ని డిగ్రీల మార్పు కూడా మనుషులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే వర్షపాతం నమూనాలో కొన్ని వారాలు లేదా నెలల మార్పు వచ్చినా పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. పర్యావరణ సున్నితత్వం కోసం మనం మన విస్తృతమైన అస్తిత్వం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

అందువల్ల మనం మన ఆధ్యాత్మిక మూలాలపై దృష్టి పెట్టి, ఈ అవగాహనను మళ్లీ జాగృతం చేయాలి. పర్యావరణం పట్ల నిర్లక్ష్యంగా, అవగాహన లేకుండా ప్రవర్తించే మానవ మనస్తత్వాన్ని కూడా, అదే సమయంలో ప్రేమతో సంరక్షించే మనస్తత్వాన్ని కూడా మనం గుర్తించాలి. మనలో కరుణ, శ్రద్ధ పెంపొందినప్పుడు అది పర్యావరణం పట్ల మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. దాని ఫలితంగా పవిత్రత అనే భావన సహజంగానే ఉద్భవిస్తుంది.

మన గ్రహం పట్ల ఒక ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకోవాలి. చెట్లను, మనుషులను, నదులను మనవిగా భావించాలి. ప్రకృతిలోనూ, మనుషులలోనూ దేవుణ్ణి దర్శించాలి. ఈ భావన సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాంటి సున్నిత హృదయుడు ప్రకృతి పట్ల శ్రద్ధ చూపకుండా ఉండలేడు. తమ పరిసరాలను, ప్రకృతిని గౌరవిస్తూ సంరక్షించే అనేక ఆదివాసీ సమాజాల జీవన విధానంలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు అని అన్నారు గురుదేవ్‌ రవిశంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement