విజయదశమి వేళ వేదమంత్రాల మధ్య విదేశీ జంటల వివాహ వేడుకలు! | Foreign Couples Getting Married At the Art Of Living Center | Sakshi
Sakshi News home page

విజయదశమి వేళ వేదమంత్రాల మధ్య విదేశీ జంటల వివాహ వేడుకలు!

Oct 25 2023 12:33 PM | Updated on Oct 25 2023 12:51 PM

Foreign Couples Getting Married At the Art Of Living Center - Sakshi

సాక్షి, బెంగళూరు: భారతీయ సంప్రదాయ వివాహ సంస్కృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా, జపాన్, మంగోలియా, అమెరికా తదితర దేశాల నుంచి మనదేశానికి విచ్చేసిన జంటలు ఇక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలోని వైదిక వివాహ మంటపంలో భారతీయ వైదిక సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. విజయదశమి పర్వదినాన జరిగిన ఈ వేడుకకు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ​ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆధ్యాత్మిక జ్ఞానం, యోగా, ఆయుర్వేదపు జ్ఞానాన్ని అందిస్తున్న గురుదేవ్, కాలక్రమంలో మరుగున పడుతున్న అనేక భారతీయ సంప్రదాయాలను కూడా పునరుద్ధరించారు.

లోతైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగిన సంప్రదాయాలు. మంత్రాలతో కూడిన వైదిక వివాహ విధానం వాటిలో ఒకటి. వర్తమాన భారతీయ వివాహాలలో సంప్రదాయాలు క్రమంగా మరుగున పడి, ఆడంబరాలు పెచ్చుమీరుతున్న ఈ కాలంలో వేదమంత్రాల సాక్షిగా ప్రమాణాలు, ఒకరిపట్ల ఒకరు నిబద్ధత కలిగి ఉండటం వంటి మౌలిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే వైదిక వివాహాలకు గురుదేవ్ తిరిగి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ప్రాచీన వాఙ్మయం ప్రకారం చూసినపుడు, వివాహ సందర్భంగా పఠించే వేదమంత్రాలు, విశ్వచైతన్యం ఒకటి మాత్రమే అనే సత్యాన్ని పెండ్లి చేసుకునే జంటకు గుర్తుచేస్తూ, వారి మధ్య అనంతకాలం నిలిచి ఉండే బాంధవ్యాన్ని ముడివేస్తాయి.

మరోవిధంగా చెప్పాలంటే అన్నం, పప్పుతో కలిసి పూర్ణం అయినట్లుగా అన్నమాట. "ఇది మాపై ఆశీర్వాదాల వర్షం కురిసినట్లు అనిపించింది. ఈ రోజు మాకు సరికొత్త ప్రారంభం.” అని మంగోలియాకు చెందిన జంట బయాస్‌గలన్, సురేంజార్గల్ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ​"మేము 8 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. వైదిక పద్ధతిలో వివాహం జరగాలని నా భాగస్వామి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉండటం వలన ఇది ఎలా ఉండబోతోందో మాకు తెలుసు. పురోహితుల జపవిధానం, వివాహప్రక్రియ నుండి స్వయంగా గురుదేవుని ఆశీర్వాదాలు పొందడం వరకు వివాహవేడుక చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగింది.

17 రకాల శాకాహార వంటకాలతో..
మాకు ఇంతకంటే మరే కోరికా లేదు." అని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి ఇక్కడకు వచ్చి వివాహం చేసుకున్న రే మోంగీ, లారెన్ డెర్బీ-లూయిస్ దంపతులు పేర్కొన్నారు. ​దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత తొమ్మిది రోజులపాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ప్రాచీన వేద మంత్రోచ్ఛారణలు, పవిత్రమైన హోమాలు, భక్తి సంగీత-నృత్యోత్సవాల శోభతో కూడిన వాతావరణం వెల్లివెరిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి, దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన లక్షలాది భక్తులు భక్తి, జ్ఞాన, ఆనందసంగమంగా సాగిన నవరాత్రి ఉత్సవాలలో పాలుపంచుకున్నారు.

​జగదంబను, దేవీశక్తిని పూజించే ఈ ఉత్సవాలలో భాగంగా నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, కెనడా సహా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో చండీహోమం, మన దేశంలో 100 ప్రాంతాలలో దుర్గాహోమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ​దుర్గాష్టమిరోజున ఇక్కడి భక్తులకోసం ఆశ్రమంలోని వంటశాలలో 17 రకాల శాకాహార వంటకాలతో కూడిన భోజనాలు1,20,000 మందికి దేవీ ప్రసాదంగా వండి వడ్డించారు. ​

(చదవండి: దసరా రోజున.. ఈ మూడు రకాల పక్షులను చూసారో.. ఇకపై విజయాలే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement