హైదరాబాద్కు చేరువలో ఉన్న ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాలో అనేక ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. ఈ జిల్లానే ఆధ్యాత్మికప్రాంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందుతుంది. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి యాదగిరిగుట్ట నృసింహుడి దర్శనానికి వచ్చి యాదగిరి క్షేత్రంలోనే గడపడంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ఆలయాలను దర్శించుకోవచ్చు. జిల్లాలో ఉన్న ఆలయాలు..
యాదగిరీశుడు
హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటలకు రూ.300 టిక్కెట్పై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ధర్మ దర్శనంతో పాటు రూ.150 టిక్కెట్ కొనుగోలుపై వీఐపీ దర్శనానికి పంపిస్తారు. వీటితో పాటు వివిధ కైంకర్యాల్లో భక్తులు టిక్కెట్ కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనవచ్చు. రాత్రి బస చేసేందుకు కొండపైన తెలంగాణ హరిత టూరిజంతో పాటు కొండ కింద దేవస్థానానికి చెందిన ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీలు, ప్రయివేట్ గదులు అందుబాటులో ఉన్నాయి.
అనుబంధంగా పాతగుట్ట..
యాదగిరీశుడి ఆలయం నుంచి 3 కి.మీ. దూరంలో పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రం కంటే ముందు పూర్వగిరిలో శ్రీస్వామి, అమ్మవార్లు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. క్రమ క్రమంగా ఈప్రాంతమే పాతగుట్టగా మారింది. యాదగిరిగుట్ట నుంచి భక్తులు గుర్రం బండ్లపై ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పూర్వగిరీశుడిని దర్శించుకుంటారు.
వెంకటపురం లక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట నుంచి కీసర, ఈసీఐఎల్ వెళ్లే మార్గంలో తుర్కపల్లి మండలం వెంకటవురంలో వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ కొండ గుహల్లో స్వామివారు కొలువై ఉన్నారు. మెట్ల మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్తుంటే ‘ఓంకారం’ రూపంలో చెట్లు ఉండటం ప్రత్యేకం. వీటిని చూసేందుకు సందర్శకులు అధికంగా వస్తారు.
భువనగిరి స్వర్ణగిరి
యాదగిరిగుట్ట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వరంగల్ –హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరిలో శ్రీస్వర్ణగిరి వేంకటేశ్వర ఆలయం ఉంది. యాదగిరీశుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకుంటారు. తిరుపతిని తలపించేలా ఈ ఆలయం ఉండడంతో తిరుపతికి వెళ్లలేని భక్తులు స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పక్కనే కోరిన కోర్కేలు తీర్చే శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం ఉంటుంది.
సకల విశేషాలకు నెలవు సురేంద్రపురి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపురి పంచముఖ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తులో పంచముఖ హనుమాన్, పంచ ముఖ శివుడి విగ్రహాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం సైతం ఉంటుంది. ప్రత్యేక టిక్కెట్ కొనుగోలు చేసి సురేంద్రపురిలో ఏర్పాటు చేసిన సకల దేవతలు కొలువైన మందిరాన్ని సందర్శించవచ్చు.
కొలనుపాక సోమేశ్వరుడు
యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన భక్తులు ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిరం, శ్రీసోమేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైన మందిరం, సోమేశ్వర ఆలయాలు నాటి కాకతీయులు, జైనులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తు చేస్తాయి.
వేములకొండ మత్స్యగిరి
వలిగొండ మండలం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, సురేంద్రపురి, నాగిరెడ్డిపల్లిలోని శివాలయాన్ని సందర్శించిన భక్తులు వలిగొండ మీదుగా ఈ వేములకొండ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలోని కోనేరులో మీసాల ఉన్న చేపలు దర్శనమిస్తాయి. సాక్షతూ శ్రీస్వామి వారే మత్స్యవతారంలో కోనేరులో భక్తులకు దర్శనమిస్తున్నారని నమ్మకం.
నాగిరెడ్డి పల్లి బంగారు శివయ్య
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బంగారు శివలింగం ఉన్న ఆలయం ఉంది. స్వచ్ఛమైన బంగారంతో మూడు అడుగుల శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. యాదగిరిగుట్ట నుంచి ఈ ఆలయం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
– సేకరణ: కళ్లెం సంపత్, సాక్షి, యాదగిరిగుట్ట


