సాక్షి, యాదాద్రి: చెన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో, ఒక్కసారిగా S-5 (ఎస్-5) కోచ్లో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలు, దట్టమైన పొగను గమనించి భయంతో కేకలు వేస్తూ, గొలుసులాగి, కిందికి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, స్థానిక అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.


