కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం పట్టించుకోదు.! | concerns over Bio diversity park in hyderabad check full details inside | Sakshi
Sakshi News home page

Bio diversity park : కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం పట్టించుకోదు.!

May 26 2025 12:16 PM | Updated on May 26 2025 4:50 PM

concerns over Bio diversity park in hyderabad check full details inside

పత్తాలేని మ్యూజియం, అక్వేరియం నిర్మాణం...

పన్నెండున్నరేళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ‘బయో డైవర్సిటీ పార్కు’ 

హైదరాబాద్‌: అంతర్జాతీయ సదస్సుకు స్మారకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన బయో డైవర్సిటీ పార్కు పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. స్థాయి అంతర్జాతీయమే కానీ గల్లీ పార్కు కన్నా అధ్వానంగా మారుతోందనేది వాస్తవం. అందరూ వ్యాఖ్యానించే స్థాయికి చేరిందని చెప్పక తప్పదు. పన్నెండున్నరేళ్లు అయినా ఎలాంటి ఎదుగు బొదుగు లేని పార్కుగా దీనిని చెప్పక తప్పదు. రాయదుర్గంలోని సర్వే నం.83 నాలెడ్జి సిటీ ప్రాంతంలోని 15 ఎకరాల విశాల స్థలంలో కాప్‌–11 సదస్సుకు చిహ్నంగా పైలాన్, పార్కును కూడా నిర్మించారు. పచ్చదనం కోసం ప్రపంచంలో అరుదుగా లభించే 200 మొక్కలు నాటి పెంచడం, లాన్‌లు ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ నేడు కళావిహీనంగా మారిపోతున్నాయి. 

ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న నాసా : ఎవరీ యువరాజ్‌ గుప్తా

అప్పట్లో ఏపీఐఐసీ, అటవీశాఖ, బయో డైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏడు కోట్లతో నిర్మించిన దీన్ని అక్టోబర్‌ 16, 2012న అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆరంభంలో పైలాన్, మొక్కలను పరిశీలించేందుకు పలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడకు వచ్చి అన్ని విషయాలు గమనించి సేద తీరి వెళ్లేవారు. ఒక ఏడాది తర్వాత రావడం మానేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహరం సమయంలో కొంత హడావుడి చేసి అనంతరం చేతులెత్తేశారు. 

ఇక జీహెచ్‌ఎంసీ పరిస్థితి చెప్పనక్కర్లేదు.. 

  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయి జీవవైవిద్య సదస్సుకు స్మారకంగా ఈబయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

  • ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దీని పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. 

  •  కేంద్రం పట్టించుకోదు.. రాష్ట్ర అసలు ముట్టుకోదు.. ఇక జీహెచ్‌ఎంసీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 

  • నగరంలో పలు పార్కులు, ముఖ్యంగా థీమ్‌పార్కులను కూడా ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ దీనిని పట్టించుకోవడమే లేదు. మాకు ఈ పార్కుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెబుతున్నారని అనుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

  • దీంతో ఇది కాస్తా ఎవరికీ పట్టని పార్కుగా మారిపోయిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. 

  • పన్నెండున్నరేళ్లుగా నిర్వహణను టీజీఐఐసీ సంస్థకు వదిలేసి చేతులు దులుపుకున్నారని అందరూ అంటున్నారు.  
     

    బయో డైవర్సిటీ పార్కు, పైలాన్‌ ఇదే మొదటిది.. 
     

  • కాప్‌ సదస్సులను హైదరాబాద్‌లో నిర్వహించే వరకు 11దేశాల్లో నిర్వహించినా,ఎక్కడా సదస్సు చిహ్నంగా పార్కు, పైలాన్‌ నిర్మించలేదు. 

  • మొదటి సారిగా మనదేశంలోనే నిర్మించడం ఈ సదస్సు ప్రత్యేకతని అధికారులే పేర్కొన్నారు. 

  • సదస్సు సందర్భంగా 200 దేశాలకు విభిన్న రకాల మొక్కలను ఆ దేశ చిహ్నంగా నాటాలని నిర్ణయించామని అందులో 101 దేశాల ప్రతినిధులు మొక్కలు నాటారు. 

  • ఆతర్వాత నాలుగేళ్ళకు అప్పటి పాకిస్తాన్‌ హైకమిషనర్‌ సల్మాన్‌ బషీర్‌ వచ్చి మొక్కను పరిశీలించి, పార్కు, పైలాన్‌ ప్రాధ్యాన్యతను తెలుసుకున్నారు. 

  • నాటి నుంచి వాటి ప్రగతిని బట్టి ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు ఐక్యరాజ్య సమితిలోని కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ సంస్థకు, ఆయా దేశాలకు కూడా పంపుతున్నట్లు అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ వీటిని పరిశీలించిన దాఖలాలు లేవు. 

 


హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని బయో డైవర్సిటీ పార్కులో 2016 వరకు రోజూ ఇలానే విద్యార్థులు పరిశీలనకు వచ్చేవారు ఆ తర్వాత ఎవరూ ఈ దిక్కు చూడడం లేదు (ఫైల్‌) 

ఈ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌... 

  • బయో డైవర్సిటీ పార్కు నిర్వహణ బాధ్యతను ఇటీవల ఫీనిక్స్‌ గ్రూప్‌కు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

  • భవిష్యత్‌లో మరింతగా ఆకర్షించేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పార్కులో ఈ క్రింది సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  

  • పచ్చదనం మరింతగా పెంచి ఆకట్టుకునేలా చుట్టూరా వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలి  

  • క్యాంటిన్‌ సౌకర్యం,ఆక్వేరియం, మ్యూజియం, సేద తీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. 

  • నిర్మాణం చేసి తాళంవేసి ఉంచిన బాత్‌రూమ్, ల్యాట్రిన్లు అందుబాటులోకి తేవాలి 

  • ప్రతి వీకెండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలి 

  • ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకరావాలి. 

  • ప్రస్తుతం కొనసాగుతున్న ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలు, వ్యర్థాలు తొలగించాలి 

  • పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి వీకెండ్స్‌లో అందరూ సేద తీరేలా థీమ్‌  పార్కులలాగా దీనిని అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయాలి. 

  • బయో డైవర్సిటీ పార్కుకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలోనే రూ. 100 కోట్లతో జీవవైవిద్య మ్యూజియం, రూ.100 కోట్లతో ప్రత్యేక అక్వేరియం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. 

  •  ఈ అంశాన్ని స్వయంగా అప్పట్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అక్టోబర్‌ 22, 2012న జూబ్లీహిల్స్‌లో కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రకటించారు.  

  • అంతేగాక అక్టోబర్‌ 18, 2012న అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి చటర్జీ  రూ. 100కోట్లతో ఆక్వేరియం, మ్యూజియాన్ని న్యూఢిల్లీలో మొదట్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ సదస్సు నిర్వహించిన హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని  ప్రకటించినా ఇది కాస్తా అప్పటి నుంచి ప్రకటనలకే పరిమితమైంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement