డబ్బు చేసే మాయ.. 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..! | China Abductee Reconnects With Family After 34 Years Separates Again | Sakshi
Sakshi News home page

డబ్బు చేసే మాయ.. 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!

Nov 6 2024 4:50 PM | Updated on Nov 6 2024 5:11 PM

China Abductee Reconnects With Family After 34 Years Separates Again

కుటుంబానికి దూరమై కష్టాల కడలిలో బతుకును సాగించాడు. తనవాళ్లెవరో తెలియక నానా బాధలు పడ్డాడు. అలా 34 ఏళ్లు గడిచిపోయాయి. తీరా తన కుటుంబాన్ని కలుసుకుంటే.. మళ్లీ డబ్బు రూపంలో వచ్చిన స్వార్థం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఎంతలా అంటే.. కుటుంబాన్నే వద్దనుకునే దాకా!!. ఈ కథ వింటే.. డబ్బు బంధాలతో ఇంత ఘోరంగా ఆడుకుంటుందా..! అని ఆశ్చర్యపోతారు. 

చైనాకు చెందిన 37 ఏళ్ల యూ బావోబావో రెండేళ్ల ప్రాయంలో తన అమ్మమ్మ ఇంటి నుంచి అపహరణకు గురై మానవ అక్రమ రవాణదారుల ముఠా(హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ గ్యాంగ్‌) చేతిలో చిక్కుకున్నాడు. అలా అక్కడ నుంచి ఓ ధనిక కుటుంబానికి విక్రయించబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు యు బాగోగులు చూడకపోగా.. హింసించింది. అయితే.. 

ఆ తర్వాత ఐదేళ్లకు మరో కుటుంబానికి దత్తతగా వెళ్లాడు. అలా 11వ ఏడు రాగానే మళ్లీ మరో కుటుంబం చెంతకు చేరాడు యూ. ఇక యు వాళ్లందరితో పడిపడి విసిగివేశారి బయటకొచ్చేశాడు. సరిగ్గా 19 ఏళ్లు రాగానే బీజింగ్‌కు చేరకుని అక్కడ డెలివరీ రైడర్‌గా స్థిరపడ్డాడు. అదే టైంలో.. 

తాను పుట్టిన కుటుంబం ఆచూకీ కోసం ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు. సరిగ్గా అతడి డీఎన్‌ఏ మ్యాచ్‌ అయిన కుటుంబ వివరాలు గురించి పోలీసులు తెలియజేయడంతో యూ ఆనందానికి అవధులు లేకుండాపోయింది. తన కుటుంబాన్ని కలుసుకుని తన తల్లి ఒడిలో సేదతీరాలనుకున్నాడు. కానీ, యుకి ఆ క్షణంలో తెలియలేదు ఈ భావోద్వేగభరిత ఆనందం ఎంతో కాలం నిలవదని. 

తీరా అక్కడకు వెళ్లాక యుకి..తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తనకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ తర్వాత యూ చేసిన స్ట్రీమింగ్‌ వ్యాపారం లాభాల బాటపట్టింది. అయితే తన కుటుంబ ఒత్తిడి మేరకు 60% ఆదాయాన్ని తన ఇద్దరు తమ్ముళ్లుతో పంచుకునేందుకు అంగీకరించాడు. అంత చేసినా.. యూకి తన మొత్తం సంపాదనలో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన వాట వచ్చేది కాదు. పైగా కొత్తగా చేరువయ్యిన తోబుట్టువులు మా కుటుబంలోని వ్యక్తిగా అంగీకరిస్తున్నాం కాబట్టి నీ స్వార్జితంలో వాటా ఇవ్వాల్సిందే అని శాసించడం మొదలుపెట్టారు. 

అక్కడితో ఆగక  'దత్తపుత్రుడు' అని పిలుస్తూ గేలి చేయడం వంటివి చేశారు. దీనికి తోడు తల్లి కూడా తన ఇద్దరు పిల్లలపై ప్రేమతో పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ.. యూని డబ్బులు కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురై..చివరికి కుటుంబాన్ని వదిలేద్దామన్న విరక్తికి వచ్చేశాడు. 

ఈ విషయాన్నే సోషల్‌ మీడియా వేదికగా వివరించాడా వ్యక్తి. అంతేగాదు తన సంపాదనంత తనలా హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బారిన పడ్డ బాధితుల కోసం ఖర్చు చేయాలనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బు ఎంత గొప్పదో.. అంత చెడ్డది అని కొందరు ఆ యూ పోస్ట్‌కు కామెంట్లు చేస్తున్నారు. 

(చదవండి: కమలా హారిస్‌​ పాటించే ఫ్లెక్సిటేరియన్‌ డైట్‌ అంటే..!)
 

Advertisement
 
Advertisement
Advertisement