నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల : చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్రారోహణ వేడుకగా నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో హోమ గుండం వద్ద అగ్ని ఆరాధన, చతుర్ధ కలశస్నపనను నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అలంకరణలు చేసే పవిత్రాలను అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీవారి మూలవిరాట్్కు, అమ్మవార్లకు అలాగే ఉత్సవమూర్తులకు అర్చకులు పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం పవిత్రాంగ హోమం, శాంతి హోమాన్ని జరిపించారు. శనివారం జరిగే పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి వేడుకలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఆదివారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు.
ఏలూరు టౌన్ : ఏలూరు కోటదిబ్బ సీసీఎస్ పోలీస్స్టేషన్ సమీపంలో సైబర్సెల్ పోలీస్స్టేషన్ భవనాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు, బాధితులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సైబర్ సెల్ స్టేషన్ను నూతన భవనంలో ఏర్పాటుచేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలపై దర్యాప్తు చేసే అవకాశం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాద్రావు, డీఎస్పీ డి.శ్రావణ్కుమా ర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, సైబర్ సెల్ సీఐ దాసు, సీఐలు రామకృష్ణ, అశోక్కుమార్, కోటేశ్వరరావు, సుబ్బారావు, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, పోలీస్ కంట్రోల్ సీఐ అఖిల్ జమా తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాకు సంబంధించి నీట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు. ఏలూరులోని రెండు కేంద్రాలను సిద్ధం చేశారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్లో 175 మందిని, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 214 మంది విద్యార్థులను కేటాయించారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రానికి డ్యూటీ మేజిస్ట్రేట్గా పెదపాడు తహసీల్దార్ కె.కృష్ణజ్యోతి, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి ఏలూరు తహసీల్దార్ ఎస్వీ రవీంద్రనాథ్ వ్యవహరించనున్నారు.
పోలవరం రూరల్: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి చేరే వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రవాహం క్రమంగా నిలకడగా మారింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం ప్రస్తుతం 26 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టుకు చెందిన 48 గేట్ల ద్వారా సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


