చింతలపూడి: ప్రతిపాదిత బొగ్గు ఆధారిత గ్యాస్ (యూసీజీ) ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను (డీపీఆర్) తక్షణమే బహిర్గతం చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని రేచర్లలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ వద్ద బొగ్గు గని ప్రతిపాదిత ప్రాంత రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సుమారు 40 ఏళ్ల క్రితం బొగ్గు పరిశోధన కోసం వేసిన బో రును నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రూ.లక్షల కోట్ల విలువైన సంపదను ప్రజల ప్రమేయం లేకుండా రిల యన్స్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఆయిల్పామ్, కోకో, కొబ్బరి, అరటి, వరి వంటి పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతంలో గ్యాస్ వెలికితీత వల్ల భూగర్భ జలాలు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామసభలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రైతు, కార్మిక సంఘాల నాయకులు మా ట్లాడుతూ ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. బలవంతపు భూ సేకరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానిక రైతులు మాట్లాడుతూ తమ జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ కంపెనీకి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి, కె.శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


