ఏలూరు (ఆర్ఆర్పేట): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ బరితెగింపు ప్రారంభమైంది. పొరుగు జిల్లాలో నివసిస్తున్న వారిని నగరంలో ఉంటున్నట్టుగా దరఖాస్తులు నింపి ఓటరు జాబితాలో నమోదుకు ఆ పార్టీ నేతలు తెరలేపిన సంఘటన నగరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఆర్ఆర్పేట ప్రాంతంలో 33వ డివిజన్ పరిధిలోని 95వ పోలింగ్ బూత్లో ఆ ప్రాంతానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు సుమారు 100 ఓట్లకు సంబంధించి షిఫ్టింగ్ దరఖాస్తులను అక్కడ విధుల్లో ఉన్న బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)కి అందజేశారు. అయితే ఆయా దరఖాస్తులకు సంబంధించి సరైన చిరునామా ఆధారాలు కానీ, స్థానిక నివాసితులుగా పేర్కొనే ఎటువంటి పత్రాలు గానీ లేవని గ్రహించిన 33వ డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కరణం జగ్గారావు ఆ దరఖాస్తులను తిరస్కరించాలని బీఎల్ఓను కోరారు. దీనిపై బీఎల్ఓ స్పందిస్తూ అన్ని ఆధారాలు ఉంటే తప్ప ఎటువంటి దరఖాస్తులు అనుమతించబోమని టీడీపీ ఇన్చార్జికి స్పష్టం చేసి వాటిని తిరస్కరించారు.


