ఏలూరు టౌన్: విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల వాహన డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు పాటించేలా స్కూల్స్, కళాశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యాసంస్థకు చెందిన ప్రతి బస్సులోనూ విధిగా డాష్బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎలాంటి నేర నేపధ్యం లేని బాధ్యతాయుతమైన డ్రైవర్లును మాత్రమే నియమించుకోవాలని ఆదేశించారు. బస్ డ్రైవర్కు విధిగా యూనిఫామ్, గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీవో శేఖర్, ఎంవీఐ విఠల్, విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలు పాల్గొన్నారు.
నెలాఖరులోగా ఏర్పాటు చేసుకోవాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్బోర్డ్ కెమెరాలను ఈ నెలాఖరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని ఇన్ఛార్జి ఆర్టీవో బాలేందు శేఖర్ స్పష్టం చేశారు. చొదిమెళ్లలోని డీటీసీ కార్యాలయంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో, ప్రమాదాలు జరిగినప్పుడు డ్యాష్బోర్డ్ కెమెరా వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు ఎన్డీ విఠల్, జీ స్వామి, ఎస్.జగదీశ్ బాబు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు పాల్గొన్నారు.
నూజివీడు: గుంటూరు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా, ఆయన కుమారుడు ముబషీర్ల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారి పెట్టిన కేసులో రిమాండ్లో ఉన్న వీరిద్దరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మచిలీపట్నంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల 16 నుంచి 18 వరకు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 16న నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ముస్తాఫాను, ముబషీర్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు నూజివీడులో డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ నేతృత్వంలో విచారించారు. మంగళవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని నెల్లూరులోని సెంట్రల్ జైల్కు తరలించారు.
పోలవరం రూరల్: పోలవరం సీఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలవరం పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలవరం మండలం తోటగొంది గ్రామానికి సమీపంలోని కాలువ గట్ల వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన సారా తయారీ కేంద్రాలను గుర్తించి తనిఖీ చేశారు. అక్కడ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటతో పాటు డ్రమ్ములు, పొయ్యిలు, ఇతర సామాగ్రిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ సారా తయారీదారులను గుర్తించి కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్సై పి. అప్పారావు హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై అప్పారావు, ఎకై ్సజ్ ఎస్సై కె. నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.


