చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,83,450 ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన సత్రంలో 2,668 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ ఈవో ఆర్వీ చందన వెల్లడించారు.
నూజివీడు: రైసు పుల్లింగ్ పేరుతో నూజివీడు ప్రాంతంలో దాదాపు రెండు కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు దాచేపల్లి శ్రీనివాసరావు ఆచూకీ తెలపాలని పట్టణ పోలీసులు మంగళవారం పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పాస్టర్ ఆర్ ప్రసన్నకుమార్ను అరెస్టు చేయగా, శ్రీనివాసరావు మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నూజివీడు స్వగ్రామం అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడిన శ్రీనివాసరావు ఈ ప్రాంతంలోని పేదవారి నుంచి రైసుపుల్లింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. దీనిపై మోసపోయామని గ్రహించిన బాధితులు ఆరునెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం సైతం అందజేస్తామని ఫ్లెక్సీలోపోలీసులు పేర్కొన్నారు.
తణుకు అర్బన్: తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని మానే మనోజ్ఞ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఇటీవల ఒంగోలులో జరిగిన బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 2026 పోటీల్లో మనోజ్ఞ డబుల్స్ విభాగంలో రాష్ట్రస్థాయి విజేతగా నిలిచినట్లు చెప్పారు. మంగళవారం కళాశాలలో ఆమెను అభినందించారు.


