గణపవరం : ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు ౖపైపెకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.300 కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.200 మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే, స్కిన్తో కూడిన చికెన్ ప్రస్తుతం కిలో రూ.250 వరకు విక్రయిస్తుండగా, బ్రాయిలర్ లైవ్ కోడి (బర్డ్) ధర కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతోంది.
ధరల పెరుగుదలకు కారణాలు
ఇటీవల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో, చాలామంది వినియోగదారులు చికెన్ కొనుగోలు వైపు మొగ్గు చూపారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ప్రస్తుతం రైతుల వద్ద అవసరానికి సరిపడా కోళ్ల లభ్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ సంస్థలు ధరలను తమ ఇష్టానుసారంగా పెంచుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో కూడా ఇదే పరిస్థితి
సాధారణంగా ఏటా వేసవిలో చికెన్ ధరలు మండిపోతుంటాయి. ఈ ఏడాది కూడా మార్చి నుంచి మే చివరి వరకు కిలో చికెన్ రూ.300 నుంచి రూ.350 వరకు, ఓ దశలో రికార్డు స్థాయిలో రూ.380 వరకు కూడా విక్రయించారు. వేసవి తర్వా త ధరలు తగ్గి సాధారణంగా కిలో రూ.200 లోపే ఉన్నప్పటికీ, మళ్లీ పది రోజులుగా ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఈ వారం ధరలు చుక్కలు తాకడంతో మాంసాహార ప్రియులు తమ కొనుగోళ్లను సగానికి సగం తగ్గించుకున్నారు.


