ద్వారకాతిరుమల : స్థానిక లింగయ్య చెరువు గట్టు ప్రాంతంలో ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చెరువు గట్టుపై ఆక్రమణల కారణంగా నిత్యం చిన వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ట్రాఫిక్ సమస్య కూడా అధికమవుతోందని పేర్కొన్నారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోపు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి పంచాయతీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నోటీసులపై పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, దుకాణాలు తొలగిస్తే జీవనోపాధిని కోల్పోతామని అంటున్నారు. చెరువు ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేసి, దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి, వాటిని అద్దెకు ఇస్తే తమకు జీవనోపాధి కొనసాగడమే కాకుండా గ్రామ పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు.


