ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న ఏలూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో–చైర్మన్ కే నరహరి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్థానిక పవర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీని వెంటనే నియమించి వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు, 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, టెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో చేపడుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగి స్వచ్ఛందంగా పాల్గొని జూలై 14న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జీ.మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఫ్యాప్టో నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–ఛైర్మన్లు జీ. వెంకటేశ్వరరావు, జంగం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


