పాలకొల్లు సెంట్రల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్నేన రోజారమణి శ్రీశక్తి పురస్కారం అవార్డును అందుకున్నారు. సోమవారం రోజారమణి మాట్లాడుతూ ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్లో అవార్డును అందుకున్నట్లు తెలిపారు. గజల్స్ శ్రీనివాస్ చేతులు మీదుగా పురస్కారం అందుకున్నట్లు తెలిపారు.
కొయ్యలగూడెం: మార్చి నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు రానున్నాయి. పండుగలతో పాటు వారాంతపు సెలవులు ఉన్నాయి. మార్చి 3న హోలీ, 19న ఉగాది, 20 లేదా 21న రంజాన్, 27న శ్రీరామనవమి పండుగలు ఉన్నాయి. నాలుగు ఆదివారాలతో పాటు.. రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. మొత్తం 11 రోజులపాటు సెలవులు వస్తుండగా అందుకు అనుగుణంగా బ్యాంకు సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాల్సి ఉంది.
తాడేపల్లిగూడెం: విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని ఏపీ నిట్ డీన్ అకడమిక్ డాక్టర్ ఎన్.జయరాం కోరారు. విద్యార్థులు సోమవారం ఏపి నిట్ను సందర్శించారు. జయరామ్ మాట్లాడుతూ విద్యార్థులు రాణించేందుకు నాణ్యమైన విద్యతో పాటు , నైతిక విలువలను పాఠశాల స్థాయి నుంచే అలవర్చుకోవాలన్నారు. విభిన్నమైన ఆలోచనలు ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని, అవి వారి వ్యక్తిత్వానికి మెరుగులు పర్చేలా ఉండాలని సూచించారు. కలలు కంటూ వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఎలా పొందాలి, ఏఏ పరీక్షలు రాయాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు.
కామవరపుకోట: రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 4 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.గవరాజు తెలిపారు. ఇటీవల డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్స్ విజయవాడ అకాడమీ నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో పాఠశాలకు చెందిన సీహెచ్ చాందిని, సంకీర్తన, కే.జోష్ణా దేవి, ఎం.యశ్వంత్ రెడ్డి బంగారపు పతకాలు, జి.వైష్ణవి, రాశి వెండి పతకాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంగ్లీష్ డిబేట్ పోటీలలో కె.లాస్య బహుమతి అందుకున్నట్లు తెలిపారు.
ఏలూరు టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు తప్పవని వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ హెచ్చరించారు. డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆదేశాలతో వన్టౌన్ ఎస్ఐ సుధాకర్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. మద్యం తాగి బైక్లు నడిపిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఎస్ఐ సుధాకర్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వీరికి న్యాయమూర్తి రూ.40 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతకు సంబంధించి ప్రతి రోజూ వాహన తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.
భీమడోలు: ప్రభుత్వ అత్యవసర సేవలను తప్పుదోవ పట్టిస్తున్న ఇద్దరు యువకులకు సోమవారం ఏలూరు కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. భీమడోలులోని అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు సంతోష్కుమార్, కొత్తపల్లి మరియదాసు మద్యం మత్తులో గ్రామంలో వీరంగం సృష్టిస్తూ తప్పుడు సమాచారంతో పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పట్టించారు. దీనిపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా తెలిపిన వివరాల ప్రకారం.. డయల్ 112 నెంబర్కు తప్పుడు సమాచారం అందిస్తూ అత్యవసర సేవల సమయాన్ని వృథా చేశారని, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, వారు కావాలని తప్పుడు కాల్ చేశారని తేలిందన్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఏలూరులోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చామన్నారు.


