జంగారెడ్డిగూడెం: అత్యాచారం కేసులో వ్యక్తిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఒక మహిళ తన కుటుంబ సమస్యల నేపథ్యంలో పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెంలో ఉంటున్న ఎంసీ మీడియా యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కరుటూరి మిథున్ అలియాస్ చక్రవర్తిని సంప్రదించింది. చక్రవర్తి అన్నపూర్ణ హెరిటేజ్ రోడ్లో ఉన్న తన కార్యాలయానికి రావాలని మహిళకు తెలిపాడు. ఫిబ్రవరి 28న రాత్రి 9 గంటలకు మహిళకు ఫోన్ చేసి తన కార్యాలయానికి రావాలనగా.. ఆ మహిళ వెళ్లింది. లోపలికి వెళ్లిన తరువాత తలుపులు వేసి, సమస్య పరిష్కరిస్తానని చెప్పి అనుచితంగా ప్రవర్తించాడు. బాధితురాలు నిరాకరించగా, బెదిరింపులకు పాల్పడి, లైంగిక దాడి చేశాడని, అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బాధితురాలిని తన కారులో ఇంటి దగ్గర దింపి, విషయం ఎవరికై నా చెప్తే ఆమెను, ఆమె కుమార్తెను చంపేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొందన్నారు. బాధితురాలు ఆదివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి కరుటూరి మిథున్ అలియాస్ చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. మిధున్పై జంగారెడ్డిగూడెం పోలీస్ డివిజన్ పరిధిలోని తడికలపూడి పీఎస్లో 4 కేసులు, జంగారెడ్డిగూడెం పీఎస్లో ఒక కేసు ఉన్నాయన్నారు.


