పెద్దింట్లమ్మా.. భక్తులను రక్షించమ్మా..
కైకలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ.. నీ భక్తులను రక్షించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. అమ్మవారి జాతర(తీర్థం) శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఉదయం జలదుర్గా పెద్దింట్లమ్మకు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఖడ్గనామార్చన, ధూపసేవ, బాలభోగం, అష్టోత్తరం, పాత్రసాధన, పంచహారతులు, నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాల పూజలు జరిగాయి. భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, శృంగవరప్పాడుకు చెందిన బలే గణేష్ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి నంది అవార్డు గ్రహీత మెజీషియన్ రఘు ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ మార్చి 3 వరకు జాతర జరుగుతుందన్నారు. జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 28న జరుగుతుందన్నారు.
కలిదిండి(కై కలూరు): బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తి కాల్వలో పడి ఊపిరాడక మరణించిన ఘటన కలిదిండి మండలం కోరుకొల్లు పెద్ద కాల్వ వద్ద శుక్రవారం జరిగింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం కోరుకొల్లుకు చెందిన వీరవల్లి ప్రసాద్(28) ఉదయం 10 గంటల ప్రాంతంలో కాల్వలో కొట్టుకుపోతున్న ప్రసాద్ను స్థానికులు రక్షించి కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


