బిల్లు.. కాంట్రాక్టర్లు ఘొల్లు
తణుకు మున్సిపాలిటీలో రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్
తణుకు అర్బన్: తణుకు మున్సిపాలిటీలో బిల్లులు పెండింగ్ పడటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం గడువులోపు పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారులో 20 నెలల్లో 100కు పైగా పనులు చేశామని, రూ.10 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. పనులు చేయించుకుంటున్నారే తప్ప బిల్లుల వరకూ వచ్చేసరికి అధికారులు అదిగోఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారని, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో పాటు జనరల్ ఫండ్స్, ఇతర ఫండ్స్తో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఎంబుక్ల రూపంలో బీరువాల్లో మూలుగుతున్నాయని అంటున్నారు. దీంతో కొత్త పనులకు టెండర్లలో కూడా పాల్గొనడం లేదని చెబుతున్నారు.
అప్పులు చేసి మరీ పనులు
అప్పులు చేసి పనులు చేస్తున్నామని బిల్లులు ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టు క్లాస్–1 నుంచి క్లాస్–5 వరకు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది రెండు నెలల కాలంలో కొంత బిల్లులు ఇచ్చారని, ఆ త ర్వాత పనులు చేయించుకోవడమే తప్ప బిల్లుల ఊసే లేదన్నారు. కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది చిన్నతరహా వారే కావడంతో బిల్లుల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు.
గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చినా..
తణుకు బ్యాంక్ కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో రూ.1.03 కోట్ల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం మొదలుపెట్టగా చంద్రబా బు సర్కారులో ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవనం అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన బిల్లు ఒక్క రూ పాయి కూడా విడుదల చేయని దుస్థితి తణుకు మున్సిపాలిటీలో నెలకొంది.


