శ్రీనివాసా.. గోవిందా
ద్వారకాతిరుమల: గోవిందా హరి గోవిందా.. అంటూ వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వే లాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో కోలాట భజన మండలి సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనివేటి మండపాలు, ఆలయ పరిసరాల్లో వివాహాలు జోరుగా జరిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న కొత్త జంటలు, వారి కుటుంబసభ్యులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో రద్దీ కొనసాగింది.


