నిలిచిన మీటర్ రీడింగ్
మీటర్ రీడర్ల ప్రధాన డిమాండ్లు
భీమవరం (ప్రకాశం చౌక్) : విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రీడింగ్ నిలిచిపోయింది. దీంతో శ్లాబ్లో తేడా వచ్చి విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు, కమిషన్పై పనిచేసే ఉద్యోగులు నరకం చూస్తున్నారు. తాజాగా విద్యుత్ మీటర్ రీడర్ల తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 1 తేదీ నుంచి విజయవాడలో ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులగా మీటర్ రీడర్లు సమ్మె చేస్తున్నా సర్కారు కనీసం పట్టించుకోవడం లేదు.
జిల్లావ్యాప్తంగా బిల్లింగ్ నిలుపుదల
రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లు రీడర్లు చేపట్టిన ధర్నాతో జిల్లాలోని 5 వేల మంది మీటర్లు రీడర్లు కూడా బిల్లింగ్ నిలుపుదల చేశారు. బిల్లులు తీయడం ఆలస్యం కావడంతో విద్యుత్ వినియోగదారులకు శ్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే శ్లాబ్ మారిపోయి. బిల్లులు పెరిగితే ఇబ్బందులు పడతామని సామాన్యులు వాపోతున్నారు. రూ.500 బిల్లు కాస్తా.. తీయడం ఆసల్యమై మరో రూ.300 పెరిగి రూ.800 వరకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 10 తేదీ లోపు బిల్లు తీయాల్సి ఉండగా.. పట్టణాలు, పల్లెల్లో 5వ తేదీ వచ్చినా కూడా బిల్లులు తీసే ప్రక్రియ ప్రారంభం కాలేదు.
మీటర్ రీడర్లు లేకపోవడంతో విద్యుత్ సంస్థ లైన్మ్యాన్లు, స్విప్ట్ ఆపరేటర్లకు ఆ పని అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 6,53,764 సర్వీసులు ఉన్నాయి. 5 వేల మంది చేయాల్సిన బిల్లింగ్ 1000 మంది ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 10వ తేదీ దాటితే బిల్లు శ్లాబ్ మరింత పెరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీ వర్తించదు. ముందస్తుగా సమాచారం ఇచ్చి రీడర్లు ధర్నాకు వెళ్లినా.. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించలేదు.
కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు
విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లపై విద్యుత్ సంస్థ ఒత్తిడి తీసుకొస్తుంది. వెంటనే కొత్త రీడర్లతో రీడింగ్ తీయాలని, ప్రతి రోజు బిల్లింగ్ 12.5 శాతం జరగాలని కాంట్రాక్టర్లు దగ్గర ఉన్న స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్స్, చార్జర్లు వెంటనే డిపార్ట్మెంట్కు ఇవ్వాలని, ఇవ్వని వారిపై పోలీస్ కేసు పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లను భయపెడుతున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కొత్త రీడర్లు వస్తే పాతవారి పరిస్థితి గురించి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు.
రూ.10 వేలు దాటని జీతం
విద్యుత్ మీటర్ రీడర్ల జీతం రూ.10 వేలు కూడా లేదు. పట్టణాల్లో పీఎఫ్, ఈఎస్ఐకు అన్నీ కలుపుకుని మీటర్కు రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయడంతో పట్టణాల్లో రూ.0.26, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా.. విద్యుత్ మీటర్ రీడర్కు చేతికి ఒక్కో మీటర్కు పట్టణంలో రూ.4.66, గ్రామీణ ప్రాంతంలో రూ.3.89 అందుతుంది. ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది.
20 ఏళ్లగా పనిచేస్తున్నా ఇదే పరిస్థితి
విద్యుత్ మీటర్ రీడర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. 20 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కల్పించకుండా రీడర్లపై కేసుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మాట మార్చిన చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు మంచి ప్రక్రియ అని చెప్పి మాట మార్చారు. స్మార్ట్ మీటర్లతో అటు ప్రజలకు, ఇటు మీటర్ రీడర్లకు ద్రోహం చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లింది.
స్మార్ట్ మీటర్ల నేపథ్యంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.
కనీస వేతనాలు అమలు చేయాలి.
రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి.
ఎస్క్రో ఖాతాను వెంటనే తెరవాలి.
కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం మూడు డివిజన్లు ఉన్నాయి. ఇందులో భీమవరం డివిజన్లో 2,09,970 సర్వీసులు, నరసాపురం డివిజన్లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్లో 2,19,440 కలిపి మొత్తం 6,53,764 సర్వీసులు ఉన్నాయి.
బిల్లులు తీయకపోవడంతో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం
నాలుగు రోజులుగా సమ్మెలో విద్యుత్ మీటర్ రీడర్లు
10 తేదీ మీటర్ రీడింగ్కు తుది గడువు
విద్యుత్ మీటర్ల రీడర్ల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం


