
ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి
ఏలూరు(టూటౌన్)/చింతలపూడి: ఖైదీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. తక్షణం వైద్య సదుపాయం కల్పించాలని ఉభయ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఆదేశించారు. ఏలూరు కోటదిబ్బలోని జిల్లా కారాగారాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ వంటకాలను పరిశీలించి రుచి చూశారు. కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందించే ఆహారం, మంచి నీరు విషయంలో రాజీ పడొద్దన్నారు. చింతలపూడి సబ్ జైలును ఆయన తనిఖీ చేశారు. ఉచిత న్యాయ సలహాలు, ముద్దాయిలకు అందించిన సాయంపై ఆరాతీశారు. వంటశాల, స్టోర్ రూం తనిఖీ చేశారు.
1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో 2024–25 రబీ సీజన్కు సంబంధించి 12,380 మంది రైతుల నుంచి 1,55,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు. సోమవారం గోదావరి సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఇంతవరకు రూ.359.27 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రూ.206.71 కోట్లను ఖాతాల్లో జమచేశామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేసేందుకు 08812–230448, 77020 03584, 75695 62076 నెంబర్లకు తెలియజేయాలన్నారు.
బీమా అని చెప్పి టీడీపీ సభ్యత్వం
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి పంచాయితీ లంబాడి గూడెం గ్రామానికి చెందిన వడితే లాలు మండల వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్గా ఉన్నారు. ఇటీవల గ్రామంలో టీడీపీ నాయకులు బీమా అని ఇంటింటికీ తిరిగారు. లాలు ఇంటికొచ్చి బీమా అని నమ్మించి రూ. 200 కట్టించుకున్నారు. సోమవారం టీడీపీ నాయకులు వచ్చి సభ్యత్వ నమోదు కార్డు ఇచ్చారు. అయితే తాము ఆ పార్టీలో చేరలేదని.. తమకు కార్డు ఎందుకు ఇచ్చారని లాలు గట్టిగా ప్రశ్నించారు. బీమా పేరుతో తెలుగుదేశం నాయకులు మోసం చేశారని, తాము ఎప్పుడూ వైఎస్సార్సీపీ పార్టీయేనని ఆయన తెలిపారు.
వృద్ధుడిని అనాథగా వదిలేసిన కొడుకు
తణుకు అర్బన్: వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు తణుకు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లిన ఘటన సోమ వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్లో మూలుగుతూ ఇబ్బందిపడుతున్న వృద్ధుడిని ప్రయాణికులు ప్రశ్నించగా.. తన పేరు ముత్యాల పల్లపరాజు అని తణుకు ముత్యాలవారి వీధిలో ఉంటున్నట్లు చెప్పారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధుడిని రైల్వే స్టేషన్లో వదలివెళ్లినట్లుగా రైల్వే పోలీసులు చెప్పారు. వృద్ధుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, కాలుపై పుండు పడి దుర్వాసన వస్తుండడంతోపాటు రాత్రి నుంచి ఆహారం కూడా తీసుకోకపోవడంతో బాగా నీరసించిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు వదిలించుకోవాలని చూడడం బాధాకరమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వృద్ధుడి వ్యవహారం వైరల్ కావడంతో చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతని కుమారుడు వచ్చి తీసుకువెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు.

ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి

ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి

ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలి