కేంద్రంతో అమీతుమీ
ఏలూరు రూరల్: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఏలూరులో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్గీకరణపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు. ఎన్నో ఏళ్లగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణం అన్నారు. వర్గీకరణ సాధిస్తేనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి 58 ఉపకులాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 13 జిల్లాల సమన్వయకర్తలు ముమ్ముడి చిన్న సుబ్బారావు, కందుల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగలశేఖర్, కాశీకృష్ణ, గద్దల ప్రసాద్, నమ్మిన లక్ష్మీ, కూచిపూడి మహేష్, అయినపర్తి మాధవరావు, చాట్ల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.