ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలో పలు పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో వడగళ్లు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటలకు పైగా వర్షం కురవడంతో రెండు మండలాల్లోని పొగాకు, మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల తీగజాతి పంటలు పాడయ్యాయి. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ప్రధాన రహదారుల వెంట పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు, పోలీసులు రోడ్లపై పడిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జీలుగుమిల్లి సీటీఆర్ఐ క్వార్టర్స్ వెనుకవైపు ఒక ఆటోపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో ఆటో పైభాగం దెబ్బతింది.
దెబ్బతిన్న మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలు