టీచర్‌ కొలువుకు సిద్ధమా.. ఇదిగో ప్రణాళిక!

Andhra Pradesh: DSC Preparation Plan And Tips In Telugu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రంగం సిద్ధమవుతోందా..? 16,000కుపైగా టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుందా...?! ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.  రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా డీఎస్సీకి అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

తొలుత టెట్‌
డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్‌ రెండుసార్లు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్‌ కోసం నిరీక్షిస్తున్నారు. వీరంతా డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే.. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో తొలుత టెట్‌ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారి టెట్‌ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. చివరిసారి నిర్వహించిన టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా.. 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు మించే అవకాశం ఉంది.

ఇంగ్లిష్‌ నైపుణ్యాలకు పరీక్ష
టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లిష్‌ మీడియం నేపథ్యంలో.. ఆంగ్లంలో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీకి ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సిలబస్‌ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరిగే ఆస్కారముంది.

టెట్‌ కమ్‌ టీఆర్‌టీ 
స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, మ్యూజిక్‌ టీచర్, క్రాఫ్ట్‌ టీచర్, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ టీచర్, ప్రిన్సిపల్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) నిర్వహిస్తారు. అలాగే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి టెట్‌ కమ్‌ టీఆర్‌టీ ఉంటుంది. 

చదవండి: (మ్యాథ్స్, ఫిజిక్స్‌ లేకున్నా.. ఇంజనీరింగ్‌)
మ్యాథ్స్, ఫిజిక్స్‌ లేకున్నా.. ఇంజనీరింగ్‌

విద్యార్హతలు
► ఎస్‌జీటీ: ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌) /డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ) (లేదా) కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉండాలి.
►స్కూల్‌ అసిస్టెంట్‌: ఆయా సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ఎస్‌ఏ–లాంగ్వేజెస్, ఎల్‌పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి అకడమిక్, టీచింగ్‌ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి.
►వయసు: 18–44 ఏళ్లు. రిజర్వేషన్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
►గమనిక: సిలబస్, పరీక్షా విధానాలు, అర్హతలు, వయసుకు సంబంధించిన సమాచారం గత నోటిఫికేషన్స్‌ ఆధారంగా ఇవ్వడం జరిగింది. 

మార్కుల వెయిటేజీ 
►స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్, టీజీటీ: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–80 మార్కులు; ఏపీ టెట్‌–20 మార్కులు).
►స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–50 మార్కులు, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌–30 మార్కులు, ఏపీ టెట్‌–20 మార్కులు).
►మ్యూజిక్‌ టీచర్‌: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ–70 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌–30 మార్కులు). 
► ప్రిన్సిపల్,పీజీటీ,క్రాఫ్ట్‌; ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ టీచర్‌: మొత్తం 100 మార్కులు(టీఆర్‌టీ).
►ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్‌ కమ్‌ టీఆర్‌టీ). 

స్కూల్‌ అసిస్టెంట్‌ (మ్యాథ్స్, బయాలజీ, సోషల్‌ స్టడీస్‌ తదితర) (టీఆర్‌టీ)

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
1. జీకే అండ్‌  కరెంట్‌ అఫైర్స్ 20  10
2. విద్యా దృక్పథాలు 10 5
3. విద్యా మనోవిజ్ఞానశాస్త్ర తరగతి గది అన్వయం 10 5
4. సంబంధిత సబ్జెక్టు కంటెంట్‌  80 40
మెథడాలజీ 40 20
మొత్తం 160 80

 ► పరీక్షకు రెండున్నర గంటల సమయం అందుబాటులో ఉంటుంది.       
‌    
ప్రిపరేషన్‌–గైడెన్స్‌

ఎస్‌జీటీ జీకే, కరెంట్‌ అఫైర్స్‌
ఎస్‌జీటీ అభ్యర్థులు తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి. స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక పేర్లు, నదీతీర నగరాలు, దేశాలు–రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన కరెంట్‌ అఫైర్స్‌ను చదవాలి. ప్రిపరేషన్‌కు వార్తా పత్రికలను ఉపయోగించుకోవాలి. కొవిడ్‌–19 వివరాలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిల్లో దాని ప్రభావం గురించి తెలుసుకోవాలి. 

విద్యా దృక్పథాలు
దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం(ఎన్‌సీఎఫ్‌–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. 

విద్యా మనోవిజ్ఞానశాస్త్రం
► శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన –స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
► ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచు కోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

కంటెంట్‌
► తెలుగు (ఆప్షనల్‌), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌స్టడీస్‌ సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, టైప్స్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్‌ తదితరాలపై పట్టు సాధించాలి.
► గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్‌ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది.
► సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
► ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.
► సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.

మెథడాలజీ
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధ నోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్‌ రాసుకుంటే.. పరీక్ష సమయంలో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్‌ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

స్కూల్‌ అసిస్టెంట్‌ 
► స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు.. ఆయా సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి.
► బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
► సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్రోద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలను చదవాలి. 

మెథడాలజీ
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోప కరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించింది. కాని బయాలజీలో మాత్రం అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చాయి.

మాక్‌టెస్ట్‌లు
కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు –స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమె టిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్‌ ముఖ్యం. మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top