● వ్యాన్ను ఢీకొన్న ఆటో
● మహిళ మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
తొండంగి: క్రైస్తవ ప్రార్థనలకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో వ్యాన్ను ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బీచ్ రోడ్డుపై గోర్సపాలెం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వాకదారిపేటకు చెందిన రాయుడు లక్ష్మి స్వగ్రామం సామర్లకోట. కాగా ప్రార్థనల కోసం తన స్వగ్రామమైన వాకదారిపేటకు రావాలని కొద్దిమంది క్రైస్తవులను ఆహ్వానించింది. దీంతో సామర్లకోట వద్ద ఉండూరు గ్రామానికి చెందిన పాస్టర్ రామిశెట్ట రాణి, సామర్లకోటకు చెందిన మంచాల అప్పలనర్స (45), పీత సింహాచలం, లావేటి వెంకటలక్ష్మి, బొట్టా నూకరత్నం, అనుబోయిన నాగమణి తదితరులు ఆటోలో సామర్లకోట నుంచి బయలుదేరారు. వాకదారిపేటలో ప్రార్థనలు ముగించుకున్న అనంతరం సామర్లకోటకు తిరిగి వస్తున్నారు. బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే గోర్సపాలెం వద్ద బీచ్రోడ్డుపై వారు బయలుదేరిన ఆటో ఉప్పాడ వైపు నుంచి ఒంటిమామి వైపు వెళ్తున్న వ్యాన్ను బలంగా ఢీకొంది. దీంతో మంచాల అప్పలనర్స అక్కడికక్కడే తలపగిలి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆటో డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాద స్థలంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికుల సహాయంతో వెంటనే క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. బీచ్ రోడ్డులో ఇటీవల కాలంలో ట్రాఫిక్ రద్దీతో పాటు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శెట్టిబలిజపేటలో విషాదం
సామర్లకోట: స్థానిక 22వ వార్డు శెట్టిబలిజపేటలో విషాదం అలముకుంది. ప్రార్థనలకు వెళ్లి ఆటోలో వస్తూండగా మంచాల అప్పలనర్స మృతి చెందడంతో అందరినీ కలచివేసింది. ఆ పేటలో అందరూ కలిసి మెలిసి ఉంటారని, ఏ శుభకార్యం జరిగినా హాజరవుతారని స్థానికులు తెలిపారు. ఇదిలాఉంటే క్షతగాత్రుల కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు పరుగులు తీశారు.


