ప్రకాశంనగర్: స్థానిక మల్లిననగర్లో ప్రముఖ ఆభరణాల కంపెనీ కళ్యాణ్ జ్యూయలర్స్ను మంగళవారం సాయంత్రం సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నమ్మకం, పారదర్శకత, వినియోగదారులకు తొలి ప్రాధాన్యం వంటి విలువలను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న సంస్థకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ కళ్యాణ్ జ్యూయలర్స్ వారి ముహూరత్ (పెళ్లి ఆభరణాల శ్రేణి), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమః (టెంపుల్ జ్యూయలరీ) వంటి ప్రముఖ హౌస్ బ్రాండ్లతో పాటు మరెన్నో అద్భుతమైన డిజైన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. షోరూం ప్రారంభోత్సవానికి నాగార్జున వస్తున్నారనే సమాచారంతో అక్కినేని అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. నాగార్జున సోగ్గాడు చిన్ని నాయన సినిమాలోని వాసివాడి తస్సదియ్య డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.


