రంగంపేట: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి వడిశలేరు బీసీ కాలనీలో తాగునీటి సమస్య నిలుస్తోంది. మూడు నెలలుగా కాలనీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, నిత్యావసరాలకు నీరు లేక పనులన్నీ మానుకుని నీటి అన్వేషణలోనే గడపాల్సి వస్తోందని మహిళలు మండిపడ్డారు. మంగళవారం బీసీ కాలనీ మహిళలు పంచాయతీ కార్యదర్శి శ్రీవల్లిని నిలదీశారు. గ్రామంలోని మిగతా వీధులకు, కాలనీలకు నిరంతరాయంగా మంచినీరు అందుతుండగా, కేవలం తమ కాలనీపైనే అధికారులు ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పనులు, వ్యవసాయ కూలీ పనులు మానుకుని దూర ప్రాంతాల్లోని బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, గర్భిణులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతపై గతంలో పలుమార్లు పంచాయతీ సిబ్బందికి విన్నవించినా, కంటితుడుపు చర్యలే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీవల్లీ మాట్లాడుతూ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన బోరు మోటారు వీక్ అవడంతో నీరు సన్నగా వస్తుందని, కొత్త మోటారు వేయాల్సి ఉందన్నారు. మరమ్మతులు చేపట్టి వారం రోజుల్లో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ వడిశలేరు బీసీ కాలనీకి అందని నీరు
ఫ పంచాయతీ కార్యదర్శిని
నిలదీసిన మహిళలు


