దేవరపల్లి: నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్ వసంత్ నగర్ ద్వారం రంగుల వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో వైఎస్సార్ వసంత్ నగర్ పేరున గతంలో పార్టీ శ్రేణులు ద్వారం ఏర్పాటు చేశారు. దానికి వైఎస్సార్ సీపీ రంగులు వేశారు. కానీ అనివార్య కారణాలతో అప్పటి నుంచి ఆ ద్వారం ప్రారంభోత్సవం కాలేదు. అలాగే అక్కడే వైఎస్సార్ విగ్రహం, బస్షెల్టర్ కూడా నిర్మించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ద్వారం, విగ్రహం, బస్షెల్టర్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని నాలుగు రోజులుగా కొత్తగా వైఎస్సార్ సీపీ రంగులు వేసి సిద్ధం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ చేబ్రోలు చిన వెంకటేశ్వరరావు(కొండ), మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మునాఫ్, గ్రామ కమిటీ అధ్యక్షులు దోవా సాయి ఆధ్వర్యంలో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అడ్డుకున్న పోలీసులు
ద్వారానికి వైఎస్సార్ సీపీ రంగులు తొలగించి, తెలుపు రంగు వేయాలని పోలీసులు పార్టీ నాయకులకు సూచించారు. ద్వారానికి తెలుపు రంగు వేయడానికి పంచాయతీ సిబ్బంది రంగు డబ్బాలతో అక్కడకు చేరుకోగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గతంలో వేసిన రంగులనే మళ్లీ వేశామని, రంగు మార్చడానికి వీలు లేదని పోలీసులకు పార్టీ నాయకులు తెలిపారు. దీంతో వారి మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున దూబచర్ల చేరుకుని ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లజర్ల సీఐ రవికుమార్, ఎస్సై ఆంజనేయబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులను
అడ్డుకున్న పోలీసులు
ద్వారానికి పార్టీ రంగులు
వేయవద్దంటూ ఆదేశాలు
గతంలో వేసిన వాటికే
మెరుగు పెడుతున్నా అడ్డగింపు
దూబచర్లలో ఉద్రిక్తత


