● ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ నరసింహారావు
● ఘనంగా తెలుగు భాషా సంబరాలు
అమలాపురం టౌన్: తెలుగు భాష మనది.. తెలుగులోనే మాట్లాడదాం.. రాబోయే తరానికి తెలుగులోని మాధుర్యాన్ని అందిద్దామని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహరావు అన్నారు. కోనసీమ రచయితల సంఘం, మహిళా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక పరంజ్యోతి జూనియర్ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన తెలుగు భాషా సంబరాలు, కవి సమ్మేళనానికి డాక్టర్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరో ముఖ్య అతిథి శ్రీశ్రీ కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ తెలుగు భాషను వ్యవహారిక భాషగా అభివృద్ధి చేసిన గిడుగు సేవలను కొనియాడారు. నరసింహారావు దంపతులు సభ ఆరంభంలో చేసిన శంఖారావం సభికులను ఆకట్టుకుంది. కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సంబరాల్లో శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి నేతృత్వంలో 50 మందితో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కవులను సత్కరించారు. తెలుగు వైభవంపై వారు వినిపించిన కవితా గానాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు నరసింహారావు, డాక్టర్ ప్రతాప్ చేతుల మీదుగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు నల్లా నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణ, సబ్బెళ్ల మహాలక్ష్మి, మాకే బాలా ర్జున సత్యనారాయణలకు గిడుగు రామమూర్తి పంతులు పేరుతో పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు తెలుగు భాషపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లోని విజేతలకు పరంజ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లా తమ్మేశ్వరరావు బహుమతులు అందజేశారు. మహిళా రచయితల సంఘం అధ్యక్షురాలు పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి, కవి అరిగెల బలరామమూర్తి. సాహితీ అభిమానులు చిక్కాల సతీష్, చిక్కాల అరుణతోపాటు కవులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


